సెన్సెక్స్‌కు నష్టాలు, నిఫ్టీకి లాభాలు!

by Dishafeatures2 |
సెన్సెక్స్‌కు నష్టాలు, నిఫ్టీకి లాభాలు!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్ల రికార్డు ర్యాలీకి బ్రేక్ పడింది. గత కొన్ని సెషన్లలో సూచీలు రోజుకొక గరిష్ఠ స్థాయిని తాకిన సూచీలు బుధవారం ట్రేడింగ్‌లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలతో పాటు విదేశీ మదుపర్లు దేశీయ ఈక్విటీల్లో పెట్టుబడులను కొనసాగించినప్పటికీ గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధపడటంతో మార్కెట్లు లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. దాంతో బెంచ్‌మార్క్ సూచీలు సెన్సెక్స్ నష్టాల్లోనూ, నిఫ్టీ స్వల్ప లాభాల్లోనూ ముగిశాయి. ఉదయం కొంతసేపు లాభాల్లో ర్యాలీ అయిన తర్వాత ఇన్వెస్టర్లు లాభాలను వెనక్కి తీసుకున్నారు. ఈ క్రమంలోనే దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకి షేర్ ధర రూ. 10,005 గరిష్ఠాన్ని తాకి తొలిసారిగా రూ. 10 వేల మైలురాయిని చేరింది.

చివరికి కంపెనీ షేర్ రూ. 9,994 వద్ద స్థిరపడింది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్ విలువ రూ. 3 లక్షల కోట్లను దాటేసింది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీ షేర్ 19 శాతం పుంజుకోవడం గమనార్హం. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 33.01 పాయింట్లు కోల్పోయి 65,446 వద్ద, నిఫ్టీ 9.50 పాయింట్లు లాభపడి 19,398 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు రాణించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా, హిందూస్తాన్ యూనిలీవర్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, నెస్లె ఇండియా కంపెనీల షేర్లు లాభాలను దక్కించుకున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్ ఫిన్‌సర్వ్, విప్రో, టాటా మోటార్స్, ఆల్ట్రా సిమెంట్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 82.27 వద్ద ఉంది.


Next Story

Most Viewed