తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

by S Gopi |
తీవ్ర ఒడిదుడుకుల మధ్య లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ ఈక్విటీ మార్కెట్ల తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం ట్రేడింగ్‌ని ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి నిధులను వెనక్కి తీసుకోవడంతో ఉదయం నుంచి నష్టాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా గరిష్ఠాల వద్ద టాటా మోటార్స్ షేర్లను మదుపర్లు భారీగా అమ్మేయడం మార్కెట్లపై ప్రభావం చూపాయి. భారత్, యూఎస్ దేశాల ద్రవ్యోల్బణ గణాంకాల వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో సూచీలు లాభనష్టాల మధ్య కదలాడాయి. అయితే, కీలక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సహా పలు షేర్లలో కొనుగోళ్ల కారణంగా తిరిగి లాభాల్లో ముగిశాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 111.66 పాయింట్లు లాభపడి 72,776 వద్ద, నిఫ్టీ 48.85 పాయింట్ల లాభంతో 22,104 వద్ద ముగిశాయి. నిఫ్టీలో నిఫ్టీ, పీఎస్‌యూ బ్యాంకింగ్ రంగాల్లో మాత్రమే ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాలను సాధించాయి. టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, భారతీ ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, టైటాన్, నెస్లె ఇండియా, ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.49 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed