60 వేలను దాటిన సెన్సెక్స్!

by Disha Web Desk 16 |
60 వేలను దాటిన సెన్సెక్స్!
X

ముంబై: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుస లాభాల పంట పండిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరల పతనంతో పాటు దేశీయంగా ద్రవ్యోల్బణం దిగొస్తుండటం, జూన్ త్రైమాసిక ఫలితాల్లో కంపెనీలు మెరుగైన లాభాలను సాధిస్తుండటం వంటి పరిణామాలతో సూచీలు వరుస వారాల్లో లాభాల బాట కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం నాటి ట్రేడింగ్‌లో బెంచ్‌మార్క్ సూచీ సెన్సెక్స్ సూచీ నాలుగు నెలల తర్వాత తిరిగి కీలక 60,000 మార్కును అధిగమించింది.

దలాల్ స్ట్రీట్‌లో మదుపర్ల సెంటిమెంట్ బలంగా ఉండటంతో ఈ ఏడాదిలో సూచీలు సుధీర్ఘమైన ర్యాలీ చూశాయి. ప్రధానంగా అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గుముఖం పట్టడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మరోవైపు భారత ఈక్విటీల్లో విదేశీ పెట్టుబడిదారులు భారీ ఎత్తున షేర్లను కొనుగోలు చేస్తుండటం మార్కెట్లలో ర్యాలీ ఊపందుకుంటోంది. దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 417.92 పాయింట్లు ఎగసి 60,260 వద్ద, నిఫ్టీ 119 పాయింట్లు పుంజుకుని 17,944 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో రంగం మాత్రమే నీరసించగా, పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఐటీ రంగాలు బలపడ్డాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్‌టెల్, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, ఎన్‌టీపీసీ, హిందూస్తాన్ యూనిలీవర్, విప్రో కంపెనీల షేర్లు అధిక లాభాలను సాధించాయి. ఎంఅండ్ఎం, ఆల్ట్రా సిమెంట్, మారుతీ సుజుకి, టాటా స్టీల్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి కరెన్సీ మారకం విలువ రూ. 79.44 వద్ద ఉంది.


Next Story

Most Viewed