SEBI: పీఎస్‌యూల డీలిస్టింగ్ నిబంధనలను సడలించిన సెబీ

by S Gopi |   (  Updated:2025-06-18 17:19:37  IST  )

పీఎస్‌యూ షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్ఛందంగా డీలిస్టింగ్‌ చేసే ప్రత్యేక విధానానికి ఆమోదం తెలిపింది.

SEBI: పీఎస్‌యూల డీలిస్టింగ్ నిబంధనలను సడలించిన సెబీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: స్టాక్ మర్కెట్ల నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు పీఎస్‌యూ డీలిస్టింగ్‌, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు, స్టార్టప్ ఈఎస్ఓపీల నిబంధనలకు సంబంధించిన కీలక ప్రతిపాదనలను ఆమోదించింది. అందులో ముఖ్యమైన, ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీల నుంచి స్వచ్ఛందంగా డీలిస్టింగ్‌ చేసే ప్రత్యేక విధానానికి ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. ప్రభుత్వం లేదా ప్రమోటరు గ్రూపు వాటా 90 శాతం లేదా అంతకుమించి ఉన్న పీఎస్‌యూలు ఈ విధానం ద్వారా డీలిస్టింగ్‌కు అర్హత పొందుతాయి. కనీస పబ్లిక్ షేర్ పరిమితి నిబంధనలను పాటించకపోయినా, ఈ పీఎస్‌యూ షేర్లను డీలిస్ట్‌ చేయొచ్చు. షేరు కనీస ధరకు కనీసం 15 శాతం అధిక ధరతో ఈ సంస్థల షేర్ల డీలిస్టింగ్‌ జరగాలని సెబీ ప్రతిపాదనల్లో ఉంది. అలాగే, స్టార్టప్‌లకు సంబంధించి లిస్టింగ్‌కి ముందు కంపెనీ ఓనర్ల వద్ద ఈఎస్ఓపీలు ఉండేందుకు సెబీ అనుమతించింది. దీనివల్ల కంపెనీలు ఐపీఓలకు రావడానికి ప్రోత్సాహం లభిస్తుందని సెబీ భావిస్తోంది. డీమ్యాట్‌కు సంబంధించి సంస్థ డైరెక్టర్లు, కీలక నిర్వాహక సిబ్బందితో సహా ఎంపిక చేసిన వాటాదారులు ఐపీఓకు దాఖలు చేయడానికి ముందు కంపెనీలో తమ వాటాలను డీమ్యాట్ రూపంలో కలిగి ఉండాలనే ఆదేశాన్ని సెబీ ఆమోదించింది. అదేవిధంగా, భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులను ప్రోత్సహించడానికి, ప్రభుత్వ బాండ్లలో ప్రత్యేకంగా పెట్టుబడి పెట్టే విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారుల (ఎఫ్‌పీఐలు) నియమాలను సరళీకరించాలని, నిబంధనలు సులభతరం చేయాలని సెబీ నిర్ణయించింది. ఈ చర్యతో భారత డెట్ మార్కెట్లో గ్లోబల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యాన్ని మరింత పెంచుతుందని భావిస్తున్నారు.

Next Story