పరిమితకాల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెంచిన ఎస్‌బీఐ..

by Web Desk |
పరిమితకాల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు పెంచిన ఎస్‌బీఐ..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) స్వల్పకాలానికి డిపాజిట్ల(ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లను పెంచుతున్నట్టు వెల్లడించింది. ఏడాది నుంచి రెండేళ్ల మధ్య రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై వడ్డీని 5 శాతం నుంచి 5.1 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన వడ్డీ రేట్లు జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చినట్టు బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో పాటు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 5.6 శాతానికి పెంచింది. 2021 డిసెంబర్‌లో ఎస్‌బీఐ తన బేస్‌రేటును 0.10 శాతం పెంచడం ద్వారా ఏడాదికి 7.55 శాతం అమల్లోకి వచ్చింది. దీని ద్వారా తక్కువ వడ్డీ రేట్లకు సమయం ముగిసినట్టేనని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. సాధారణంగా రుణాలిచ్చేందుకు బేస్‌రేటును ఆధారంగా తీసుకుంటారు. కాబట్టి బేస్ రేటు పెంపుతో ఇతర వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కాగా, గత వారం ప్రైవేట్ రంగ దిగ్గజ్జం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు సైతం పలు కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2-3 ఏళ్ల కాలపరిమితి ఉండి రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై 5.2 శాతానికి, 3-5 ఏళ్ల కాలానికి 5.2 శాతానికి, 5-10 ఏళ్లకు 5.6 శాతానికి పెంచింది. పెంచిన రేట్లు జనవరి 12 నుంచి అమల్లోకి వచ్చింది.



Next Story