JioPC: టీవీని పీసీలా మార్చుకునే సరికొత్త సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో

by S Gopi |

పేరుకు తగినట్టుగానే జియోపీసీ క్లౌడ్-ఆధారిత కంప్యూటింగ్ సేవలందిస్తుంది.

JioPC: టీవీని పీసీలా మార్చుకునే సరికొత్త సేవలను ప్రారంభించిన రిలయన్స్ జియో
X

దిశ, బిజినెస్ బ్యూరో: రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం విభాగం జియో అన్ని రకాలుగా కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే 4జీ నెట్‌వర్క్‌లను తక్కువ ధరలు తీసుకొచ్చిన కంపెనీ, ఆ తర్వాత 5జీ సేవలను కూడా తొందరగానే అందుబాటులోకి తెచ్చింది. అలాగే, యాప్‌ ఎకోసిస్టమ్‌ను, జియోఫోన్ ద్వారా స్మార్ట్ ఫీచర్ ఫోన్‌ను, జియో ఫైబర్‌తో బ్రాడ్‌బ్యాండ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా పర్సనల్ కంప్యూటింగ్‌లోకి కూడా ప్రవేశించింది. సోమవారం రిలయన్స్ జియో 'జియోపీసీ' అనే కొత్త తరహా సేవలను లాంచ్ చేసింది. పేరుకు తగినట్టుగానే జియోపీసీ క్లౌడ్-ఆధారిత కంప్యూటింగ్ సేవలందిస్తుంది. ముఖ్యంగా సబ్‌స్క్రైబర్లకు చౌకైన కంప్యూటింగ్‌ను అందించే లక్ష్యంతో దీన్ని తెచ్చినట్టు కంపెనీ వెల్లడించింది.

జియోపీసీ అనేది జియో సెట్ టాప్ బాక్స్ ద్వారా పనిచేసే కొత్త వర్చువల్ డెస్క్‌టాప్ సర్వీస్. ఇది టీవీని పీసీలా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తుంది. దీనికి సపోర్ట్ చేయగలిగే టీవీతో పాటు యాక్టివ్ జియో సెట్ టాప్ బాక్స్ సర్వీస్ అవసరం. అలాగే, కస్టమర్లు ఒక కీబోర్డ్, మౌస్ విడిగా కొనుగోలు చేయాలి. అయితే, ప్రస్తుతానికి ఈ జియోపీసీ ఏ ఆపరేటింగ్ సిస్టమ్(ఓఎస్)పై పనిచేస్తుందో స్పష్టత ఇవ్వనప్పటికీ, సెట్ టాప్ బాక్స్‌ ద్వారా పనిచేసే జియో ప్లాట్‌ఫామ్‌ల ఓఎస్‌పై ఆధారపడుతుందని తెలుస్తోంది. జియోపీసీ సర్వీస్ ద్వారా వెబ్ బ్రౌజింగ్, వర్డ్ ప్రాసెసింగ్, ఇ-లెర్నింగ్ సెషన్‌లు, యాప్‌లను అందిస్తుంది.

ఎలా యాక్సెస్ చేయాలంటే

జియోపీసీ సేవల యాక్సెస్ పొందడానికి జియో సెట్ టాప్ బాక్స్ పరికరం అవసరం. సబ్‌స్క్రైబర్లు జియోపీసీకి యాక్సెస్‌ను అందించే సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ఎంచుకోవచ్చు లేదా వారు రూ. 5,499 వన్-టైమ్ పేమెంట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం, రిలయన్స్ జియోపీసీ సేవలను ఉచిత ట్రయల్‌ కింద అందిస్తోంది. ఇది క్లౌడ్-ఆధారిత సర్వీస్ కాబట్టి, జియోపీసీ ఉపయోగించుకోవడానికి సబ్‌స్క్రైబర్‌లకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.

Next Story