Reliance Jio: ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ ప్రొవైడర్‌గా జియో

by S Gopi |

రిలయన్స్ జియో మొత్తం 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్(ఎఫ్‌డబ్ల్యూఏ) సబ్‌స్క్రైబర్ బేస్ మే నెలలో 68.8 లక్షలకు చేరుకుంది.

Reliance Jio: ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ ప్రొవైడర్‌గా జియో
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో, అమెరికాకు చెందిన టెలికాం దిగ్గజం టీ-మొబైల్‌ను అధిగమించి సబ్‌స్క్రైబర్ బేస్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్ ప్రొవైడర్‌గా అవతరించనుంది. ఈ మేరకు ఆదివారం ఓ నివేదిక తెలిపింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, రిలయన్స్ జియో మొత్తం 5జీ ఫిక్స్‌డ్ వైర్‌లెస్ యాక్సెస్(ఎఫ్‌డబ్ల్యూఏ) సబ్‌స్క్రైబర్ బేస్ (లైసెన్స్ లేని బ్యాండ్ రేడియోతో సహా) మే నెలలో 68.8 లక్షలకు చేరుకుంది. ఇదే సమయంలో టీ-మొబైల్ మార్చి నెలలో 68.5 లక్షల సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. ట్రాయ్ డేటా ఆధారంగా సంజేష్ జైన్, మోహిత్ మిశ్రా, అపరాజిత చక్రవర్తి కలిసి రాసిన ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, రిలయన్స్ జియో దాదాపు 10 లక్షల మంది వరకు బ్యాండ్ రేడియో సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. దీన్ని మినహాయిస్తే జియో ఎఫ్‌డబ్ల్యూఏ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 59 లక్షల వరకు ఉంటుంది. నెలవారీగా కంపెనీకి 7.4 లక్షల మంది కొత్త కస్టమర్లు చేరుతున్నారు. ఇదే ధోరణిలో జియోకు కొత్త వినియోగదారులు పెరిగితే జూన్ డేటా వచ్చే నాటికి జియో ఎఫ్‌డబ్ల్యూఏ సబ్‌స్క్రైబర్ల సంఖ్య టీ-మొబైల్‌ను దాటి ప్రపంచ ఆధిపత్య టెలికాం కంపెనీగా మారవచ్చు. దేశీయంగా కూడా వైర్‌డ్, వైర్‌లెస్ విభాగాల్లో 50.72 శాతం వాటాతో రిలయన్స్ జియో ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే. ట్రాయ్ ప్రకారం, మే నెలలో జియో ఫిక్స్‌డ్ వైర్‌డ్ బ్రాండ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ బేస్ 1.35 కోట్లు, వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్ బేస్ 48.1 కోట్లను కలిగి ఉంది. బ్రాడ్‌బ్యాండ్ విభాగంలో 30.99 శాతం వాటాతో జియో తర్వాత భారతీ ఎయిర్‌టెల్ ఉంది. ప్రస్తుతం భారత టెలికాం మార్కెట్‌ను ఈ రెండు ప్రైవేట్ కంపెనీలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయి.

Next Story