డెబిట్, క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించి ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ!

by Dishafeatures2 |
డెబిట్, క్రెడిట్ కార్డుల జారీకి సంబంధించి ఆర్‌బీఐ సర్క్యులర్ జారీ!
X

ముంబై: భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డుల జారీకి సంబంధించి ఓ సర్క్యులర్ జారీ చేసింది. కార్డ్ నెట్‌వర్క్, కార్డు జారీచేసే బ్యాంకులు, నాన్-బ్యాంకుల మధ్య ఉన్న ఏర్పాట్లు వినియోగదారులకు అనుకూలంగా లేవని ఆర్‌బీఐ తన సర్క్యులర్‌లో అభిప్రాయపడింది. బ్యాంకులు డెబిట్, క్రెడిట్, ప్రీపెయిడ్ కార్డులను జారీ చేసే సమయంలో కస్టమర్లకు ఏ కార్డు నెట్‌వర్క్ ఎంచుకోవాలనే దానికి సంబంధించి స్వేచ్ఛను కల్పించాలని ఆర్‌బీఐ తెలిపింది. ప్రస్తుతం దేశంలో మాస్టర్‌ కార్డు, వీసా, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, రూపే వంటి విభిన్న చెల్లింపుల నెట్‌వర్క్‌ సంస్థలు ఉన్నాయి. సాధారణంగా బ్యాంకులు జారీ చేసిన కార్డుని బట్టి కార్డు నెట్‌వర్క్ సంస్థలను బ్యాంకులే నిర్ణయిస్తాయి.

తాజా సర్క్యులర్‌లో కార్డు జారీ చేసే బ్యాంకులు ఒకటి కంటే ఎక్కువ నెట్‌వర్క్‌లు ఉండేలా చూడాలని, అదేవిధంగా అర్హత కలిగిన వినియోగదారులకు దేశంలో వివిధ కార్డ్ నెట్‌వర్క్‌లను ఎంచుకునే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఈ ఎంపిక విధానాన్ని కార్డులు జారీ చేసే సమయంలో లేదా తర్వాత చేసుకునే విధంగా ఉండాలి. అంతేకాకుండా కారుడ్ జారీ చేసే బ్యాంకులు ఇతర కార్డు నెట్‌వర్క్ సేవలను పొందకుండా ఏదైనా కార్డు నెట్‌వర్క్ సంస్థతో ఏటువంటి ఒప్పందాన్ని చేసుకోకూడదని సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయని, దీనిపై అభిప్రాయాలను తెలిపేందుకు ఆగష్టు 4 నుంచి అవకాశం ఉంటుందని ఆర్‌బీఐ తెల్పింది.


Next Story