RBI: కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారానికి బ్యాంకులు ఏఐని వాడుకోవచ్చు: ఆర్‌బీఐ గవర్నర్

by S Gopi |

2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 95 కమర్షియల్ బ్యాంకులపై కస్టమర్ల నుంచి కోటికి పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు.

RBI: కస్టమర్ ఫిర్యాదుల పరిష్కారానికి బ్యాంకులు ఏఐని వాడుకోవచ్చు: ఆర్‌బీఐ గవర్నర్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల కార్యకలాపాలపై వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృత్రిమ మేధస్సు(ఏఐ)ని ఉపయోగించాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్ర తెలిపారు. సొమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని 95 కమర్షియల్ బ్యాంకులపై కస్టమర్ల నుంచి కోటికి పైగా ఫిర్యాదులు అందాయని చెప్పారు. భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో వేగంగా పెరుగుతున్న కస్టమర్ బేస్, బ్యాంకింగ్ సేవల మధ్య మనం సమర్థవంతంగా, కలిసి పనిచేయకపోతే ఇటువంటి ఫిర్యాదులు ఇంకా ఎక్కువగా వస్తాయి. ప్రధానమైన ఏటీఎం ఫెయిల్యూర్, తప్పుడు ఛార్జీలను గుర్తించేందుకు, ముందస్తు వార్నింగ్ మెసేజ్‌లు పంపేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పెద్ద మొత్తంలో డేటా విశ్లేషణ కోసం ఏఐని ఉపయోగించవచ్చని ఆయన సూచించారు. భిన్న భాషలు కలిగిన మనలాంటి దేశాల్లో భాషకు సంబంధించిన అవరోధాలను తొలగించేందుకు ఏఐ ద్వారా పనిచేసే చాట్‌బాట్‌లు, వాయిస్ రికగ్నిషన్ సాధనాలను కూడా వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

Next Story