ఆర్‌బీఎల్‌కు భారీ జరిమానా విధించిన ఆర్‌బీఐ!

by Disha Web Desk 13 |
ఆర్‌బీఎల్‌కు భారీ జరిమానా విధించిన ఆర్‌బీఐ!
X

ముంబై: ప్రైవేట్ రంగ ఆర్‌బీఎల్ బ్యాంకుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) భారీ జరిమానా విధించింది. లోన్ రికవరీ ఏజెంట్లకు సంబంధించిన ఆదేశాలను పాటించని కారణంగా ఆర్‌బీఐ సుమారు రూ. 2.27 కోట్ల పెనాల్టీ విధించినట్టు సోమవారం ప్రకటనలో తెలిపింది. 2018-19 నుంచి 2021-22 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్‌బీఎల్‌కి చెందిన లోన్ రికవరీ ఏజెంట్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం నియంత్రణ లోపాలను గుర్తించామని, ఆ సమయంలో ఆయా లోన్ రికవరీ ఏజెంట్లు బెదిరింపులు, వేధింపులను నియంత్రించడంలో ఆర్‌బీఎల్ విఫలమైందని, ఏజెంట్లను నియమించే ముందు సరైన ధృవీకరణ చేపట్టలేదని ఆర్‌బీఐ వివరించింది.

దీనికి సంబంధించి ఆర్‌బీఎల్‌ ఇంకా స్పందించలేదు. గతేడాది ఆర్‌బీఐ తన నియంత్రణలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సర్క్యులర్ జారీ చేసింది. ఆయా సంస్థలు, వారి ఏజెంట్లు ఎలాంటి బెదిరింపులకు, వేధింపులకు పాల్పడకుండా ఉండాలని, అలా ఏదైనా జరిగితే చర్యలు ఉంటాయని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


Next Story

Most Viewed