LNG: ఇరాన్ దాడులతో భారత్‌కు గ్యాస్ సరఫరాను తగ్గించినట్లు ప్రకటించిన ఖతార్

by S Gopi |

ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఉత్పత్తిదారు అయిన ఖతార్ ఎనర్జీ తన స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడుల తర్వాత ఎల్ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసింది.

LNG: ఇరాన్ దాడులతో భారత్‌కు గ్యాస్ సరఫరాను తగ్గించినట్లు ప్రకటించిన ఖతార్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇరాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో ఉత్పత్తి నిలిచిపోవడంతో భారత్‌కు చేయాల్సిన లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్‌జీ) సరఫరా తగ్గించినట్లు ఖతార్ వెల్లడించింది. గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతల వల్ల భారత ఎల్ఎన్‌జీ సరఫరాకు ముప్పు ఉందని ఖతార్ ప్రకటించింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్‌జీ ఉత్పత్తిదారు అయిన ఖతార్ ఎనర్జీ తన స్థావరాలపై ఇరాన్ డ్రోన్ దాడుల తర్వాత ఎల్ఎన్‌జీ ఉత్పత్తిని నిలిపివేసింది. దీంతో భారతీయ కొనుగోలుదారుల కాంట్రాక్ట్ షిప్‌మెంట్‌లపై ప్రభావం ఉంటుందని, అనుకున్న విధంగా సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతుందని వెల్లడించింది.

భారత దిగుమతులపై ప్రభావం

భారత్ ఏటా దాదాపు 27 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీని దిగుమతి చేసుకుంటుంది. మొత్తం దిగుమతుల్లో ఖతార్ 40 శాతం వాటా కలిగి ఉంది. విద్యుత్, ఎరువుల ఉత్పత్తి, సీఎన్‌జీ పంపిణీ, వంట గ్యాస్ నెట్‌వర్క్‌లకు ఎల్ఎన్‌జీ కీలకమైన ఇంధనం. ఖతార్ నుంచి సంవత్సరానికి 8.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్‌జీ కోసం ఒప్పందాలు చేసుకున్న పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ, గెయిల్ (ఇండియా), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) సంస్థలు సరఫరా అంతరాయంపై ప్రకటన విడుదల చేశాయి. ఈ పరిస్థితుల్లో వినియోగదారులకు సీఎన్‌జీ సరఫరాను కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. అయితే, ఎదురయ్యే కొరతను నివారించేందుకు పరిశ్రమలకు చేసే ఎల్ఎన్‌జీ డెలివరీలను 10-30 శాతం మేర తగ్గించనున్నట్టు పేర్కొన్నాయి.

కంపెనీలు ఇప్పుడు డిమాండ్‌ను తీర్చడానికి స్పాట్ మార్కెట్ కొనుగోళ్లను అన్వేషిస్తున్నాయి, కానీ వీటి ధరలు రెట్టింపు అయ్యాయి. ప్రస్తుతం ఎల్ఎన్‌జీ మిలియన్‌ బ్రిటిష్ థర్మల్ యూనిట్ ధర 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది టర్మ్ కాంట్రాక్ట్ రేట్ల కంటే దాదాపు రెండు రెట్లు అధికం.

హార్ముజ్ జలసంధి-సరఫరా ఇబ్బందులు

ప్రపంచ ముడి చమురు, ఎల్ఎన్‌జీలో ఎక్కువ భాగం ప్రయాణించే కీలకమైన షిప్పింగ్ మార్గం హార్ముజ్ జలసంధి దాడుల కారణంగా మూతబడింది. భారత ఎల్ఎన్‌జీ దిగుమతుల్లో దాదాపు 60 శాతం, ముడి చమురు దిగుమతుల్లో దాదాపు సగం ఈ చోక్ పాయింట్ ద్వారా రవాణా అవుతాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రమాదం మరింత పెరుగుతుంది.

ఆర్థిక, పారిశ్రామిక చిక్కులు

ప్రధానంగా దిగుమతి చేసుకున్న ఎల్ఎన్‌జీ ఫీడ్‌స్టాక్‌పై ఎక్కువగా ఆధారపడే మనదేశ ఎరువుల రంగం, ఉద్రిక్త పరిస్థితులు కొనసాగితే అధిక ఖర్చులు, తీవ్ర సరఫరా కొరతను ఎదుర్కోవలసి వస్తుంది.

అలాగే, గ్యాస్ ఆధారిత పరిశ్రమలు ఇన్‌పుట్ ఖర్చు ఒత్తిళ్లను ఎదుర్కొనవచ్చు. తద్వారా ఉత్పత్తి తగ్గిపోవచ్చు. అయితే ప్రభుత్వం, కొనుగోలుదారులు సరఫరా వనరులను ఇతర మార్గాల నుంచి సేకరించేందుకు ప్రయత్నించనున్నారు.

Next Story