జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు నిరాశ కలిగించింది: ఆర్‌బీఐ మాజీ గవర్నర్!

by Disha Web Desk 16 |
జూన్ త్రైమాసికంలో భారత వృద్ధి రేటు నిరాశ కలిగించింది: ఆర్‌బీఐ మాజీ గవర్నర్!
X

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి 13.5 శాతంగా ఉండటం నిరాశ కలిగించిందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంతో పోలిస్తే వృద్ధి భారీగా పుంజుకుంటుందనే అంచనాలు ఉన్నాయని, గణాంకాలు దానికి విరుద్ధంగా ఉండటం ఆందోళనకరమని ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతేడాది ఇదే సమయంలో కరోనా సెకెండ్ వేవ్ వల్ల ఆర్థికవ్యవస్థ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. రానున్న రోజుల్లో వస్తువుల ధరలు అధికంగా ఉండటం, ఆర్థిక మాంద్యం భయాలు, ద్రవ్యపరపతి విధానం కఠినంగా ఉండనుండటం, దేశవ్యాప్తంగా సరైన సమయంలో వర్షాలు లేకపోవడం వంటి అంశాలు ప్రతికూలంగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. రాబోయే ఐదేళ్ల కాలంలో ఆర్థికవ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్లకు చేరాలంటే ఏడాదికి 8-9 శాతం మధ్య వృద్ధి సాధించాలి.

దేశంలోని అన్ని రంగాలు రాణిస్తేనే ఇది సాధ్యమై, ప్రస్తుతం వృద్ధికి అవసరమైన అంశాలు నెమ్మదించాయని సుబ్బారావు వివరించారు. క్షీణ దశలో ఉన్న ప్రైవేట్ రంగం పెట్టుబడులు వృద్ధి చెందాలని, ప్రపంచవ్యాప్తంగా మాంద్యం ఆందోళనల వల్ల ఎగుమతుల్లో సవాళ్లు ఉన్నాయన్నారు. సేవల రంగం గణనీయంగా పుంజుకోవడంతోనే తొలి త్రైమాసికంలో వృద్ధికి మద్దతు లభించింది. ముఖ్యంగా తక్కువ ఆదాయం ఉన్న వర్గాలకు వృద్ధి ఫలాలు ఎంతవరకు చేరుతున్నాయనే దాన్ని బట్టి ఆర్థికవ్యవస్థ పటిష్టత ఆధారపడి ఉందని ఆయన తెలిపారు. పెట్టుబడుల ఉపసంహరణ, పెరుగుతున్న కెరెంటు ఖాతా లోటు రూపాయిపై ప్రభావం చూపాయి. కానీ, ఇతర దేశాలతో పోలిస్తే రూపాయి ఇప్పటికీ బలంగానే ఉందని ఆయన వెల్లడించారు.


Next Story