Phonepe: త్వరలో ఫీచర్‌ఫోన్‌లోనూ ఫోన్‌పే సేవలు

by S Gopi |

దీనికోసం ఫోన్‌పే కంపెనీ జీఎస్‌పే టెక్నాలజీని స్టాక్‌ను కొనుగోలు చేసింది.

Phonepe: త్వరలో ఫీచర్‌ఫోన్‌లోనూ ఫోన్‌పే సేవలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే కస్టమర్ల కోసం సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవలు ప్రధానంగా ఫీచర్ ఫోన్ వాడుతున్నవారికి. ఇప్పటివరకు స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు మాత్రమే చేయగలిగిన యూపీఐ ఆధారిత చెల్లింపులను సాధారణ ఫీచర్ ఫోన్ కస్టమర్లు కూడా చేసే సదుపాయాన్ని త్వరలో ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఫోన్‌పే కంపెనీ జీఎస్‌పే టెక్నాలజీని స్టాక్‌ను కొనుగోలు చేసింది. గుప్‌షప్ అనే కంపెనీ నుంచి దీన్ని ఫోన్‌పే సొంతం చేసుకుంది. రానున్న రోజుల్లో దేశీయంగా కొత్త ఫీచర్ ఫోన్‌లకు సొంత యూపీఐ యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ఫోన్‌పే ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికీ ఫీచర్‌ఫోన్‌లను వాడుతున్న చాలామంది భారతీయ వినియోగదారులకు డిజిటల్ చెల్లింపులు చేయడం సులభం అవుతుందని ఫోన్‌పే వెల్లడించింది. 2024 నాటికి దేశవ్యాప్తంగా సుమారు 24 కోట్ల మంది ఫీచర్‌ఫోన్‌లను వాడుతున్నారు. కాబట్టి వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ చెల్లింపుల్లో సవాళ్లను అధిగమించడం సాధ్యమవుతుందని పేర్కొంది.

జీఎస్‌పే ఎన్‌పీసీఐ డెవలప్ చేసిన యూపీఐ 123పే ఆధారంగా పనిచేస్తుంది. ఫీచర్‌ఫోన్‌లలో యూపీఐ సేవలు పనిచేసేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఫోన్‌పే ఫీచర్‌ఫోన్‌లలో ప్రారంభించే యూపీఐ ద్వారా ఆఫ్‌లైన్ క్యూఆర్ చెల్లింపూ, పీ2పీ లావాదేవీలు, ఇతర యూపీఐ కస్టమర్ల నుంచి మొబైల్ నంబర్ ద్వారా చెల్లింపులు చేసే ఫీచర్లు ఉంటాయి. భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్‌ఫోన్ల మధ్య లావాదేవీలు నిర్వహించే ప్రక్రియ కూడా సాధ్యమేనని ఫోన్‌పే స్పష్టం చేసింది.

Next Story