Paytm: పేటీఎం గేమింగ్ సంస్థకు రూ. 5,712 కోట్ల జీఎస్టీ నోటీసులు

by S Gopi |   (  Updated:2025-04-29 12:55:02  IST  )

2018, జనవరి నుంచి 2023, మార్చి మధ్యకాలంలో ఫస్ట్ గేమ్స్ కంపెనీకి 28 శాతం వడ్డీని లెక్కించినట్టు డీజీజీఐ పేర్కొంది.

Paytm: పేటీఎం గేమింగ్ సంస్థకు రూ. 5,712 కోట్ల జీఎస్టీ నోటీసులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ఫిన్‌టెక్ దిగ్గజం పేటీఎంకు చెందిన అనుబంధ గేమింగ్ సంస్థ ఫస్ట్ గేమ్స్ టెక్నాలజీకి జీఎస్టీ అధికారులు షాక్ ఇచ్చారు. వడ్డీ, జరిమానాతో కలిపి రూ. 5,712 కోట్లను చెల్లించాలని కోరుతూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్(డీజీజీఐ) షోకాజ్ నోటీసులను జారీ చేసింది. నోటీసుల ప్రకారం, 2018, జనవరి నుంచి 2023, మార్చి మధ్యకాలంలో ఫస్ట్ గేమ్స్ కంపెనీకి 28 శాతం వడ్డీని లెక్కించినట్టు డీజీజీఐ పేర్కొంది. అయితే, వాస్తవానికి కంపెనీ ప్లాట్‌ఫామ్ ఫీజు లేదా గేమింగ్ కంపెనీల ద్వారా వచ్చే ఆదాయంపై 18 శాతం ఆధారంగా పన్నులు చెల్లించింది. 2023, అక్టోబర్ 1 నాటి సవరించిన జీఎస్టీ ప్రకారం కంపెనీ మిగిలిన మొత్తాన్ని వడ్డీ, జరిమానా కలిపి చెల్లించాలని డీజీజీఐ వెల్లడించింది. ఇది మొత్తం పరిశ్రమ ఎదుర్కొంటున్న కీలకమైన సమస్యం. జీఎస్టీ విభాగం గతంలో అనేక గేమింగ్ కంపెనీలకు ఇటువంటి నోటీసులను ఇచ్చింది. ఈ వ్యవహారం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. చర్యలకు సంబంధించి అత్యున్నత న్యాయస్థానం స్టే ఇవ్వడంతో కంపెనీలకు మధ్యంతర ఉపశమనం పొందాయి. గత నెలలో కూడా పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్‌కు రెండు అనుబంధ కంపెనీల కొనుగోలుకు సంబంధించి రూ. 611 కోట్లకు పైగా విలువైన లావదేవీలపై షోకాజ్ నోటీసులు ఇచ్చింది. విదేశీ మారకపు నిర్వహణ చట్టాన్ని ఉల్లంఘించిన కారణంగా ఈడీ ఈ నోటీసులను జారీ చేసింది.

Next Story