Oil Companies: చమురు సంస్థలకు లీటరు డీజిల్‌పై రూ.18, పెట్రోల్‌పై రూ.14 నష్టం

by S Gopi |

ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ, ఓఎంసీలు లీటరు డీజిల్‌పై సుమారు రూ.18, పెట్రోల్‌పై రూ.14 నష్టాలతో అమ్మకాలు నిర్వహిస్తున్నాయి.

Oil Companies: చమురు సంస్థలకు లీటరు డీజిల్‌పై రూ.18, పెట్రోల్‌పై రూ.14 నష్టం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారత ఇంధన రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. దీనివల్ల ఇండియన్ ఆయిల్(ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం(బీపీసీఎల్) వంటి చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీలు) భారీ ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా ప్రకారం, ఎక్సైజ్ సుంకం తగ్గించినప్పటికీ, ఓఎంసీలు లీటరు డీజిల్‌పై సుమారు రూ.18, పెట్రోల్‌పై రూ.14 నష్టాలతో అమ్మకాలు నిర్వహిస్తున్నాయి. ముడి చమురు ధరలు పెరిగినా, పెట్రోల్ బంకుల వద్ద ధరలు స్థిరంగా ఉండటమే ఇందుకు కారణమని ఇక్రా అభిప్రాయపడుతోంది. గత కొన్ని నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు గణనీయంగా పెరిగాయి. భారత ‘క్రూడ్ బాస్కెట్’ ధర జనవరిలో బ్యారెల్‌కు 63 డాలర్లు ఉండగా, మార్చిలో 113 డాలర్లకు, ఏప్రిల్‌లో 116 డాలర్లకు చేరింది. అయితే ఈ పెరుగుదల వినియోగదారులకు పూర్తిగా బదిలీ కాలేదు.

ఇంధన రంగంతో పాటు ఎరువుల రంగం కూడా ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటోందని ఇక్రా చెబుతోంది. ఎల్‌పీజీ ధరలు పెరగడం వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.80,000 కోట్ల నష్టం ప్రభుత్వం, ఓఎంసీలు భరించాల్సి రావచ్చు. అలాగే ఎరువుల సబ్సిడీ భారం రూ.2.05–2.25 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇది బడ్జెట్ అంచనాలను మించిపోయే స్థాయిలో ఉంది. సల్ఫర్, అమ్మోనియా వంటి ముడి పదార్థాల ధరలు పెరగడం వల్ల ఉత్పత్తి ఖర్చులు మరింత పెరుగుతున్నాయని తెలిపింది. ఈ పరిణామాలు ఎల్ఎన్‌జీ, ముడి చమురు దిగుమతులపై ఆధారపడిన కంపెనీలపైనా ఉండనుంది. ఇవి లాభాలు తగ్గడంతో పాటు అప్పుల భారాన్ని ఎదుర్కొనే పరిస్థితి రావచ్చు. అదనంగా, ఎల్-నినో ప్రభావంతో రాబోయే ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయం దెబ్బతింటే, రైతుల కొనుగోలు సామర్థ్యం కూడా తగ్గే ప్రమాదం ఉందని ఇక్రా వెల్లడించింది.

Next Story