భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్న స్విస్ కంపెనీలు

by Dishanational1 |
భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు క్యూ కడుతున్న స్విస్ కంపెనీలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: చాక్లెట్ తయారీ కంపెనీ బారీ కాలిబాట్, టెక్ దిగ్గజం బుహ్లార్ సహా స్విట్జర్లాండ్‌కు చెందిన చాలా కంపెనీలు భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నాయని ఆ దేశ ఆర్థిక వ్యవహారాల సెక్రటరీ హెలెన్ బడ్లిగర్ అన్నారు. అలాగే, హెస్ గ్రీన్ మొబిలిటీ సంస్థ 2025 నాటికి భారత్‌లో 3,000 ఈవీ బస్సులను తయారు చేయనుంది. దానికోసం రాబోయే 6-8 ఏళ్లలో 110 బిలియన్ డాలర్లను(రూ. 9 లక్షల కోట్లకు పైనే) పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉందని హెలెన్ తెలిపారు. బారీ కాలిబాట్ తన మూడవ తయారీ ప్లాంటును ఈ ఏడాదిలోనే భారత్‌లో ప్రారంభించనుంది. గడిచిన ఐదేళ్ల కాలంలో కంపెనీ దేశీయంగా 50 మిలియన్ డాలర్ల(రూ.414 కోట్లు) పెట్టుబడులు పెట్టింది. ఇక, బుహ్లార్ కంపెనీ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన మూడు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా మరో 2-3 ఏళ్లలో రూ. 190 కోట్ల వరకు పెట్టుబడులకు సిద్ధంగా ఉందని హెలెన్ వివరించారు. ఇవి కాకుండా అనేక చిన్న కంపెనీలు భారత్‌లో అడుగు పెట్టనున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా రవాణా, ఆటోమేషన్, మెడ్‌టెక్ లాంటి పరిశ్రమల్లో ఇరు దేశాల వ్యాపారానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెలెన్ బడ్లిగర్ అభిప్రాయపడ్డారు. ఇటీవల భారత్-యూరప్ స్వేచ్ఛా వాణిజ్య సంఘం(ఈఎఫ్‌టీఏ) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదిరిన సంగతి తెలిసిందే. దీనివల్ల వచ్చే 15 ఏళ్లలో భారత్‌లోకి రూ. 8.3 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం లభించింది. 10 లక్షల మందికి పైగా ఉపాధి పొందనున్నారు.


Next Story

Most Viewed