Crude Oil: మనదేశానికి తక్షణ చమురు సమస్య లేనట్టే

by S Gopi |

హార్ముజ్ జలసంధి సరఫరా మార్గాన్ని మూసివేయడం వల్ల భారత్‌కు చమురు సరఫరాలో స్వల్పకాలంలో అంతరాయం ఎదుర్కొనే అవకాశం లేదని అధికారులు వివరించారు.

Crude Oil: మనదేశానికి తక్షణ చమురు సమస్య లేనట్టే
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మృతి నేపథ్యంలో అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్‌ జలసంధి భగ్గుమంది. ఈ చమురు మార్గాన్ని మూసివేస్తున్నట్లు టెహ్రాన్‌ ప్రకటించడంతో చమురు రవాణాపై సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌కు తక్షణ చమురు అంతరాయం ఏర్పడుతుందనే ఆందోళన అక్కరలేదని అధికారులు వెల్లడించారు. కనీసం 10 రోజుల అవసరాలకు సరిపడా ముడి చమురు నిల్వలు, మరో 5-7 రోజులకు సరిపడా ఇంధన నిల్వలు ఉండటంతో, హార్ముజ్ జలసంధి సరఫరా మార్గాన్ని మూసివేయడం వల్ల భారత్‌కు చమురు సరఫరాలో స్వల్పకాలంలో అంతరాయం ఎదుర్కొనే అవకాశం లేదని అధికారులు వివరించారు. అయితే, యుద్ధ పరిస్థితుల వల్ల ప్రపంచ ముడి చమురు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, అధిక చమురు ధరలు భారత దిగుమతి బిల్లును పెంచుతాయి. ఇప్పటికిప్పుడైతే, ముడి చమురు సరఫరా కంటే ధరల పెరుగుదల ప్రభావం వల్ల సమస్యలు ఎదురవుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. కీలక హార్మూజ్ జలసంధి మూసేయడం వల్ల భారత్ సరఫరా వనరులను మార్చుకోవచ్చు. హార్ముజ్ జలసంధి చుట్టూ వివాదం తీవ్రమైతే, రష్యా, యునైటెడ్ స్టేట్స్, పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికాతో సహా అనేక ప్రాంతాల నుంచి ముడి చమురు సేకరణను పెంచుకుంటుంది. మధ్యప్రాచ్యం నుంచి సరఫరా కష్టమైతే భారత చమురు శుద్ధి సంస్థలు రష్యా చమురు కొనుగోలును పెంచవచ్చని విశ్లేషకులు వెల్లడించారు.

Next Story