Mercedes Benz: బలహీన రూపాయి ప్రభావం.. ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్

by S Gopi |

జనవరి 1 నుంచి మొదటి దశలో భాగంగా అన్ని మోడళ్లపై 2 శాతం వరకు పెంపు ఉండనుంది.

Mercedes Benz: బలహీన రూపాయి ప్రభావం.. ధరలు పెంచిన మెర్సిడెస్ బెంజ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలోని ప్రీమియం విదేశీ కార్ల తయారీ కంపెనీలు వరుసగా ధరల పెంపును ప్రకటిస్తున్నాయి. ఇటీవలే బీఎండబ్ల్యూ పెంపు నిర్ణయం తీసుకోగా, మంగళవారం మరో లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా తమ కార్ల ధరలు పెంచుతున్నామని స్పష్టం చేసింది. ఇటీవలి పరిణామాల మధ్య యూరోతో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి మారకం విలువ క్షీణించడం వల్ల దిగుమతులు, సరఫరా, ఇతర ఖర్చులు పెరిగాయని, ఆ భారాన్ని అధిగమించేందుకు వచ్చే ఏడాదిలో దశల వారీగా ప్రతి త్రైమాసికానికి ఒకసారి ధరలు పెంచుతామని కంపెనీ ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యార్ తెలిపారు. జనవరి 1 నుంచి మొదటి దశలో భాగంగా అన్ని మోడళ్లపై 2 శాతం వరకు పెంపు ఉండనుంది. 2025లో యూరో-రూపాయి మారకపు రేటు నిలకడగా రూ. 100 మార్కు కంటే ఎక్కువగా ఉండటం, ఇది చారిత్రక సగటుల కంటే గణనీయంగా ఎక్కువ కావడం వంటి విదేశీ మారకపు సవాళ్లు ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని కంపెనీ పేర్కొంది. వచ్చే ఏడాది ప్రతి త్రైమాసికంలో ధరల పెంపు గురించి ఆలోచిస్తున్నాం. 18 నెలల క్రితం యూరోకు రూ. 89 ఉండేది. ఇప్పుడు రూ. 104-105కి చేరింది. అంటే 15-18 శాతం క్షీణత. జనవరిలో పెంపు తర్వాత కూడా 10-15 శాతం అంతరం ఉంటుందని సంతోష్ అయ్యర్ వెల్లడించారు.

Next Story