M&M: ఎస్‌యూవీ, కమర్షియల్ వాహనాల ధరలు పెంచిన మహీంద్రా

by S Gopi |

ఎస్‌యూవీ, కమర్షియల్ వాహనాలపై ధరలు పెంచినట్టు కంపెనీ వెల్లడించింది.

M&M: ఎస్‌యూవీ, కమర్షియల్ వాహనాల ధరలు పెంచిన మహీంద్రా
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) మరోసారి వాహనాల ధరలను పెంచుతూ వినియోగదారులకు షాకిచ్చింది. ఎస్‌యూవీ, కమర్షియల్ వాహనాలపై ధరలు పెంచినట్టు కంపెనీ వెల్లడించింది. సవరించిన ధరలు జూలై 10 నుంచి అమల్లోకి రానుండగా, ఎస్‌యూవీలపై 2.7 శాతం, కమర్షియల్ వాహనాలపై 2 శాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ముడి సరుకుల ధరలు పెరగడం వల్ల తయారీ వ్యయం భారంగా మారిందని, అందుకే కొంత మేర వినియోగదారులకు బదిలీ చేయాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. అయితే అన్ని మోడళ్లపై ఒకే స్థాయిలో పెంపు ఉండదని, వాహనం, వేరియంట్‌ను బట్టి ధరల్లో మార్పు ఉంటుందని స్పష్టం చేసింది. ఇదివరకు ఏప్రిల్‌లో కూడా మహీంద్రా తన ఎస్‌యూవీల ధరలను 2.5 శాతం, కమర్షియల్ వాహనాల ధరలను 1.6 శాతం వరకు పెంచిన సంగతి తెలిసిందే. వాహన రంగంలో మహీంద్రా మాత్రమే కాదు, దాదాపు అన్ని కంపెనీలు పెంపు దిశగా అడుగులు వేస్తున్నాయి. కియా ఇండియా ఇప్పటికే జూలై 1 నుంచి అన్ని మోడళ్లపై 2 శాతం పెంచగా, టాటా మోటార్స్ కూడా మూడు నెలల్లో రెండోసారి ధరలను 1.5 శాతం వరకు సవరించింది. మారుతీ సుజుకీ జూన్ నుంచి కొన్ని మోడళ్లపై రూ.30,000 వరకు, హ్యుండాయ్ రూ.12,800 వరకు ధరలు పెంచాయి.

Next Story