PNG: పీఎన్‌జీకి మారకపోతే ఎల్‌పీజీ సరఫరా బంద్: ప్రభుత్వ ఉత్తర్వులు

by S Gopi |

పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఎల్‌పీజీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

PNG: పీఎన్‌జీకి మారకపోతే ఎల్‌పీజీ సరఫరా బంద్: ప్రభుత్వ ఉత్తర్వులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: గ్యాస్ నెట్‌వర్క్ విస్తరణను పెంచడమే కాకుండా, ఎల్‌పీజీపై ఆధారపడటాన్ని తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉత్తర్వుల ప్రకారం, పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌(పీఎన్‌జీ) కనెక్టివిటీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కనెక్షన్ తీసుకోని వారికి, ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా నిలిపేయనున్నట్టు స్పష్టం చేసింది. 3 నెలల్లోగా పీఎన్‌జీకి మారాలని సూచించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా ఎల్‌పీజీ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. పీఎన్‌జీ మారడం ద్వారా సిలిండర్ల రీఫిల్ బుకింగ్ పని తప్పుతుంది, 24 గంటల పాటు గ్యాస్ సరఫరా ఉంటుంది. సాంకేతిక కారణాలతో ఇంటికి చేరే పైప్డ్ గ్యాస్ రాని పక్షంలోనే ఎల్‌పీజీ సరఫరా చేయనున్నారు. దీనికోసం పీఎన్‌జీ గ్యాస్ కంపెనీ నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని తెలిపింది. ఇక, పైప్డ్ గ్యాస్‌లైన్ విషయంలో నిర్ణీత గడువులోపు అధికారులు అనుమతులు ఇవ్వాలని, ఎక్కువ ఫీజు కూడా వసూలు చేయొద్దని పేర్కొంది.

6 కోట్ల బ్యారెళ్ల రష్యా చమురు

మరోవైపు, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం వల్ల దేశీయంగా ఇంధన సరఫరాకు ఆటంకం లేకుండా ఉండేందుకు భారత్ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా రష్యా నుంచి 6 కోట్ల బ్యారెళ్ల చమురును మన రిఫైనరీలు కొనుగోలు చేశాయని సమాచారం. ఈ చమురు ఏప్రిల్ నెలలో డెలివరీ కానుంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ కథనం పేర్కొంది. అయితే, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న కారణంగా బ్రెంట్ క్రూడ్ కోసం మన చమురు శుద్ధి సంస్థలు బ్యారెల్‌కు అదనంగా 5-15 డాలర్ల వరకు చెల్లించినట్టు తెలుస్తోంది.

Next Story