బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్: వడ్డీ రేట్లను పెంచిన కోటక్ బ్యాంక్

by Disha Web Desk 17 |
బ్యాంకు వినియోగదారులకు గుడ్‌న్యూస్: వడ్డీ రేట్లను పెంచిన కోటక్ బ్యాంక్
X

న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ కోటక్ మహీంద్రా బ్యాంక్ తన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను సవరించింది. రూ. 2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను 15 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెంచిన రేట్లు ఆగస్టు 17 నుంచి అమల్లోకి వచ్చాయని తెలిపింది. దీంతో ఏడాది కాలవ్యవధి ఉన్న ఎఫ్‌డీలపై 5.60 శాతం నుంచి 5.75 శాతానికి చేరుకుంది. ఏడాది నుంచి మూడేళ్ల కాలానికి 5.75 శాతం నుంచి 5.90 శాతానికి పెరిగింది.

అలాగే, మూడు నుంచి పదేళ్ల కాలవ్యవధి కలిగిన ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లలో మార్పు లేదని బ్యాంకు ఓ ప్రకటనలో పేర్కొంది. ఇదే సమయంలో ఆరు నెలల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు పెంచుతూ బ్యాంకు నిర్ణయించింది. ఆరు నుంచి తొమ్మిది నెలల కాలపరిమితిపై వడ్డీ 5 శాతం, 12 నెలల కాల వ్యవధికి 5.75 శాతానికి పెంచింది.

ఇటీవల దేశవ్యాప్తంగా అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఆర్‌బీఐ కీలక రెపో రేట్లను మూడు సార్లు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంకులు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. ఇప్పటికే ఎస్‌బీఐ, పీఎన్‌బీ, ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుతో పాటు ప్రైవేటు రంగ బ్యాంకులు సైతం వడ్డీ రేట్లను సవరించాయి.


క్రెడిట్ కార్డు వలన లాభమా? లేక నష్టమా?


Next Story

Most Viewed