BSNL: ఎయిర్‌టెల్ కంటే ఎక్కువ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు సాధించిన బీఎస్ఎన్ఎల్

by S Gopi |

బీఎస్ఎన్ఎల్ కూడా అనూహ్యంగా ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి అత్యధిక సబ్‌స్క్రైబర్లను సాధించిన రెండో కంపెనీగా నిలిచింది

BSNL: ఎయిర్‌టెల్ కంటే ఎక్కువ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లు సాధించిన బీఎస్ఎన్ఎల్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది ఆగష్టు నెలలో ప్రైవేట్ రంగ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో మరోసారి భారీ సంఖ్యలో సబ్‌స్క్రైబర్లను సాధించింది. అంతేకాకుండా ఇదే నెలలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా అనూహ్యంగా ఎయిర్‌టెల్‌ను వెనక్కి నెట్టి అత్యధిక సబ్‌స్క్రైబర్లను సాధించిన రెండో కంపెనీగా నిలిచింది. టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో జియో కొత్తగా 19.5 లక్షల సబ్‌స్క్రైబర్లను సాధించింది. ఆ తర్వాత బీఎస్ఎన్ఎల్ 13.8 లక్షల మందిని సంపాదించగా, ఎయిర్‌టెల్ 4.96 లక్షల మందిని కొత్తగా చేర్చుకుంది. అయితే, మరో ప్రైవేట్ రంగ వొడాఫోన్ ఐడియా మాత్రం మరోసారి నిరాశపరుస్తూ 3.09 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. ఆగష్టు ఆఖరు నాటికి జియో మొత్తం 47.9 కోట్ల మంది కస్టమర్లను కలిగి ఉంది. ఆ తర్వాత ఎయిర్‌టెల్ 39.2 కోట్లు, వొడాఫోన్ ఐడియా 20.35 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 9.2 కోట్ల మంది వినియోగదారులతో కొనసాగుతున్నాయి. బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన 4జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురావడంతో కొత్తగా భారీ సంఖ్యలో కస్టమర్లను సాధిస్తోంది.

Next Story