10 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించిన జియో!

by Disha Web Desk 17 |
10 లక్షల కొత్త సబ్‌స్క్రైబర్లను సాధించిన జియో!
X

న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా 10 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్లను సాధించింది. దాంతో జియో మొత్తం వినియోగదారుల సంఖ్య 42.71 కోట్లకు చేరుకుంది. మరో దిగ్గజ భారతీ ఎయిర్‌టెల్ సైతం ఫిబ్రవరిలో కొత్తగా 9.82 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకోవడంతో మొత్తం వినియోగదారుల సంఖ్యను 36.98 కోట్లకు చేర్చుకుంది. అప్పుల్లో ఉన్న వొడాఫోన్ ఐడియా 20 లక్షల మంది కస్టమర్లను కోల్పోయినట్టు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజా ప్రకటనలో పేర్కొంది.

వొడాఫోన్ ఐడియా మొత్తం మొబైల్ సబ్‌స్క్రైబ్ బేస్ 23.79 కోట్లకు తగ్గిపోయింది. ఫిబ్రవరి చివరి నాటికి దేశంలో మొత్తం 114.20 కోట్లుగా ఉన్నారు. ఇది నెలవారీగా చూస్తే స్వల్పంగా 0.09 శాతం తగ్గింది. ఇక, సమీక్షించిన నెలకు సంబంధించి బ్రాడ్‌బ్యాండ్ సబ్‌స్క్రైబర్లు 83.91 కోట్ల నుంచి ఫిబ్రవరి చివరి నాటికి 0.02 శాతం పెరిగి 83.93 కోట్లకు చేరినట్టు ట్రాయ్ వెల్లడించింది.

అందులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ 43.52 కోట్లు, భారతీ ఎయిర్‌టెల్ 23.97 కోట్లు, వొడాఫోన్ ఐడియా 12.37 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 2.49 కోట్ల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో టెలికాం వినియోగదారులు 62.64 కోట్లు ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 51.56 కోట్లకు తగ్గారని ట్రాయ్ పేర్కొంది.



Next Story