Wipro: విప్రోపై ఫిర్యాదు చేసిన ఐటీ సంఘం!

by Disha Web Desk 10 |
Wipro: విప్రోపై ఫిర్యాదు చేసిన ఐటీ సంఘం!
X

బెంగళూరు: దేశీయ ఐటీ దిగ్గజం విప్రో కొత్త కష్టాలను కొని తెచ్చుకుంది. ఇప్పటికే అంతర్జాతీయంగా టెక్ కంపెనీల్లో తొలగింపులు జరుగుతున్న సమయంలో ఫ్రెషర్లను ఆఫర్ చేసిన దానికంటే సగం జీతంతో పని చేయాలని కోరడం వివాదంగా మారింది. ఇప్పటికే ఈ వ్యవహారంపై విమర్శలు మొదలవగా, తాజాగా ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయిస్ సెనెట్(నైట్స్) విప్రోపై కార్మిక మంత్రిత్వ శాఖకు బుధవారం ఫిర్యాదు చేసింది. కంపెనీ ఫ్రెషర్ల జీతాన్ని అనైతికంగా తగ్గిస్తోంది. ఇది వారికి ఇచ్చిన ఆఫర్ లెటర్ నిబంధనలను స్పష్టంగా ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొంది. 12 నెలలకు పైగా ఆన్‌బోర్డింగ్ కోసం ఎదురుచూతున్న ఫ్రెషర్లు ముందుగా ఒప్పుకున్న రూ. 6.50 లక్షల జీతానికి బదులు రూ. 3.50 లక్షలకు ఒప్పుకుంటే ఉద్యోగంలో చేరవచ్చని విప్రో ఉద్యోగులకు తెలిపింది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా సహా పలు దిగ్గజ ఐటీ సంస్థలు ఫ్రెషర్లను ఆన్‌బోర్డింగ్ చేయడంలో ఆలస్యం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో విప్రో ఆఫర్ లెటర్ నిబంధనలను గౌరవించి, ఉద్యోగుల జీతాలను అనైతికంగా తగ్గించకుండా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖకు చేసిన ఫిర్యాదులో నైట్ వెల్లడించింది.


Next Story