Water Bottle: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమపై యుద్ధ ప్రభావం

by S Gopi |

ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బాటిల్ వాటర్ ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించే చాలా ముడిపదార్థాల ధరలు పెరుగుతున్నాయి.

Water Bottle: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమపై యుద్ధ ప్రభావం
X

దిశ, బిజినెస్ బ్యూరో: మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా మనదేశంలో ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోంది. దాదాపు 5 బిలియన్ డాలర్ల(రూ. 46.30 వేల కోట్ల) విలువైన ఈ పరిశ్రమలో ఎండాకాలానికి ముందే హీట్ పెరిగింది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా బాటిల్ వాటర్ ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించే చాలా ముడిపదార్థాల ధరలు పెరుగుతున్నాయి. వీటిలో ప్లాస్టిక్ బాటిళ్లు, బాటిల్ క్యాప్‌లు, లేబుల్స్, కార్డ్‌బోర్డ్ పెట్టెలు ఉన్నాయి. ఈ ఖర్చులను భరించలేని కొన్ని బాటిల్ వాటర్ కంపెనీలు ధరలను పెంచడం ప్రారంభించాయి. దేశవ్యాప్తంగా దాదాపు 2,000 చిన్న బాటిల్ వాటర్ తయారీదారులు ఇప్పటికే తమ రీసెల్లర్లపై బాటిల్‌కు రూ. 1 పెంచారు. రాబోయే రోజుల్లో ధరలు మరో 10 శాతం పెరగవచ్చని పరిశ్రమ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతానికైతే, కస్టమర్లపై ఈ భారం పడలేదు. అనేక దిగ్గజ కంపెనీలు కస్టమర్లను కోల్పోకుండా ఉండటానికి అదనపు ఖర్చును భరిస్తున్నాయి.

పెరుగుతున్న ఖర్చులకు ప్రధాన కారణం ముడి చమురు ధరలు పెరగడమే. ప్లాస్టిక్ బాటిళ్లను పాలిమర్ అనే పదార్థంతో తయారు చేస్తారు, ఇది ముడి చమురు నుంచి ఉత్పత్తి అవుతుంది. చమురు ధరలు పెరగడంతో, ప్లాస్టిక్ బాటిళ్ల తయారీ ఖర్చు దాదాపు 50 శాతం పెరిగి కిలోగ్రాముకు రూ. 170కి చేరుకుంది. బాటిల్ క్యాప్‌ల ధర కూడా రెట్టింపు కంటే ఎక్కువగా పెరిగి ఒక్కొక్కటి రూ. 0.45కి చేరుకుంది. పెట్టెలు, లేబుల్‌లు, అంటించే టేప్ వంటి ఇతర ప్యాకేజింగ్ వస్తువులు కూడా ఖరీదయ్యాయి. ప్రీమియం మినరల్ వాటర్ బ్రాండ్‌లపైనా ఈ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఉదాహరణకు, ఆవా బ్రాండ్ తన రీసెల్లర్ల ధరలను 18 శాతం పెంచింది. కానీ, ధరలను స్థిరంగా ఉంచడానికి అనేక కంపెనీలు ప్రస్తుతం అదనపు ఖర్చులో 40–50 శాతం చెల్లిస్తున్నాయి.

Next Story