Medicine Supply: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో మెడిసిన్ ధరలు పెరిగే అవకాశం

by S Gopi |

దేశంలోని ఔషధాల కీలక టోకు కేంద్రాల్లో ఒకటైన ఢిల్లీలోని భాగీరథి ప్యాలెస్ మార్కెట్‌లో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాపారులు తెలిపారు.

Medicine Supply: పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలో మెడిసిన్ ధరలు పెరిగే అవకాశం
X

దిశ, బిజినెస్ బ్యూరో: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తల ప్రభావం ఇప్పుడు ఔషధ రంగంపైనా పడింది. దీనివల్ల రాబోయే వారాల్లో మెడిసిన్‌ ధరలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రభావం ఇప్పటికే హోల్‌సేల్ వ్యాపారులపై పడిందని వ్యాపారులు, పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. దేశంలోని ఔషధాల కీలక టోకు కేంద్రాల్లో ఒకటైన ఢిల్లీలోని భాగీరథి ప్యాలెస్ మార్కెట్‌లో సరఫరాపై ఒత్తిడి పెరుగుతోందని వ్యాపారులు తెలిపారు. పెరుగుతున్న ముడిసరుకుల ధరలు మొత్తం సరఫరాపై ప్రభావం చూపడం ప్రారంభించాయని ఢిల్లీ డ్రగ్ ట్రేడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆశిష్ గ్రోవర్ అన్నారు. ఔషధాల తయారీకి వాడే ముడిసరుకులో చాలావరకు దిగుమతి అవుతుంది. ముఖ్యంగా అల్యూమినియం, ప్లాస్టిక్ వంటి పదార్థాల ధరలు పెరిగాయి. దీనివల్ల ప్యాకేజింగ్ ఖర్చులు పెరిగి, ఔషధాల మొత్తం ధరను పెంచుతోంది. అయితే, ఈ ప్రభావం పారాసెటమాల్, అమోక్సిసిలిన్, మెట్‌ఫార్మిన్, అజిత్రోమైసిన్ వంటి సాధారణ మందుల ధరలు, సరఫరాపైనా ఉంది. జ్వరం, మధుమేహం, ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ వ్యాధుల చికిత్సకు వీటిని ఎక్కువ వాడుతున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది వీటిని ప్రతిరోజూ తీసుకుంటారు. కానీ, ప్రస్తుతానికైతే నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడకపోతే సరఫరాపై ఆందోళంగా ఉందని వ్యాపారులు పేర్కొన్నారు.

Next Story