Israel-Iran Tentions: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో భారత్‌పై ప్రభావం

by S Gopi |

ప్రపంచ వాణిజ్యంలో చోక్ పాయింట్ అయిన హార్ముజ్ జలసంధిని మూసివేస్తే ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థలను ప్రభావితం చేస్తుంది.

Israel-Iran Tentions: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలతో భారత్‌పై ప్రభావం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈసారి పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో మాత్రమే కాకుండా, భారత్ లాంటి దేశాలను కూడా ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రపంచ ఆర్థికవ్యవస్థకు కేంద్రమైన హార్ముజ్ జలసంధి ఈ ప్రాంతంలోనే ఉంది. ఇది అత్యంత ఇరుకైన, కీలకమైన జలమార్గం. దీని ద్వారానే ప్రపంచంలోని సముద్రమార్గ చమురులో మూడింట ఒక వంతు సరఫరా అవుతోంది.

హార్ముజ్ జలసంధి ప్రపంచ చోక్‌పాయింట్

పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్ మధ్య ఉన్న ఈ సముద్ర మార్గం ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇక్కడ సమస్యలు తలెత్తితే, చమురు ధరలు పెరగడమే కాకుండా సరఫరా వ్యవస్థలో సవాళ్లు ఎదురవుతాయి. ప్రపంచ వాణిజ్యంలో కీలకమైన చోక్ పాయింట్ అయిన హార్ముజ్ జలసంధిని మూసివేస్తే భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఇంధన ఆధారిత ఆర్థికవ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. వెల్త్ మేనేజ్‌మెంట్ సంస్థ జూలియస్ బేర్‌లో ఎకనామిక్స్, నెక్స్ట్ జనరేషన్ రీసెర్చ్ హెడ్ నార్బర్ట్ రకర్ ప్రకారం, 'భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ సైనిక దాడులు ఈ ప్రాంతంలో మరిన్ని భయాలను పెంచుతున్నాయి. చమురు ఇలాంటి సంఘర్షణలకు ఎక్కువ ప్రభావితమవుతుంది. దానివల్ల ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయి. రాబోయే రోజులు, వారాలు ఈ పెరుగుదల కొనసాగవచ్చు, ఆ తర్వాత కూడా ఎంత దూరం వెళుతుందో చెప్పలేమని' అన్నారు.

ఈ పరిస్థితుల వల్ల భారత్ ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొనవచ్చు. ఎందుకంటే, చమురు దిగుమతుల్లో మూడింట రెండు వంతులు, లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) దిగుమతుల్లో దాదాపు సగానికి పైగా హార్ముజ్ జలసంధి ద్వారానే రవాణా అవుతోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి, మూసివేత లేదా అంతరాయం ఏర్పడితే, భారత్ ప్రత్యామ్నాయ వనరులు, మార్గాలను వెతక్కోవలసి వస్తుంది. ఫలితంగా అధిక ఖర్చులు, లాజిస్టికల్ సవాళ్లు ఎదురవుతాయి. నష్టాలను తగ్గించడానికి నిల్వలను పెంచాల్సిన అవసరం ఉంది.

చమురు ధరలు, ద్రవ్యోల్బణ సమస్యలు

ఘర్షణలు పెరిగితే చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లకు పెరగవచ్చు. ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే అవకాశం ఉంది. భారత్ కరెంట్ ఖాతా లోటు కూడా పెరుగుతుందని జేపీ మోర్గాన్ హెచ్చరించింది. ఎక్కువ కాలం, ఖరీదైన నౌకల రీ-రూటింగ్ కారణంగా ముడి చమురు ధరలు పెరగడం వల్ల షిప్పింగ్ కంపెనీలకు నిర్వహణ ఖర్చులు పెరుగుతాయి. తద్వారా సరకు రవాణా ఛార్జీలు, డెలివరీ సమయాలు పెరుగుతాయి.

ఇంటి ఖర్చులు, పరిశ్రమలపై ఒత్తిడి

చమురు ధరల పెరుగుదల వల్ల మన దేశంలో ఇంటి ఖర్చులు, వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. పెరుగుతున్న ఇంధన ఖర్చులు వినియోగదారుల బడ్జెట్‌ను తగ్గిస్తాయి, జీవన వ్యయాన్ని పెంచవచ్చు. అదనంగా, ముడి చమురుపై ఆధారపడిన పరిశ్రమలు పెరిగిన ఉత్పత్తి ఖర్చులను భరించక తప్పదు. హార్ముజ్ జలాల్లో నావిగేట్ చేసే షిప్పింగ్ ఓడలకు బీమా ప్రీమియంలు పెరగడం, ప్రపంచ వాణిజ్య ఖర్చులపై మరింత ఒత్తిడి పెంచుతాయి.

Next Story