ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు: నిర్మలా సీతారామన్

by Dishanational1 |
ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు: నిర్మలా సీతారామన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో ధరల పెరుగుదలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ, ముఖ్యంగా తక్కువ సమయంలో పాడయ్యే వస్తువుల ధరలను కట్టడికి చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి పేర్కొన్నారు. ఉల్లిని ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు, గామా కిరణాల ద్వారా తేమను తగ్గించేందుకు భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్(బార్క్) ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. 2022లో ఏప్రిల్-డిసెంబర్ మధ్య భారత రిటైల్ ద్రవ్యోల్బణం 6.8 శాతం నుంచి 2023లో 5.5 శాతానికి తగ్గింది. ప్రస్తుతం సీపీఐ ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది. నిర్దేశించిన లక్ష్యం 2-6 శాతం మధ్యే ఉందని మంత్రి తెలిపారు. ఉల్లి ధరల్లో అస్థిరతను తనిఖీ చేసేందుకు ప్రభుత్వం బఫర్ పరిమాణాన్ని 2020-21లో లక్ష మెట్రిక్ టన్నుల నుంచి 2023-24లో 7 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచిందని చెప్పారు. ప్రస్తుతం ఉల్లి లాంటి ఎక్కువగా పాడైపోయే ఉత్పత్తుల సంరక్షణను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. ఇక, గతేడాది 8.79 లక్షల మెట్రిక్ టన్నుల్ తూర్ దాల్, 15.14 లక్షల మెట్రిక్ టన్నుల మసూర్ దాల్‌ను దిగుమతి చేసుకుంది. ప్రజలపై ధరల భారాన్ని తగ్గించేందుకు 'భారత్ దాల్ ' పేరుతో కిలో రూ.60కి, 30 కిలోల ప్యాక్‌ను కిలో రూ. 55కి అందుబాటులో ఉంచినట్టు పేర్కొన్నారు.

Next Story

Most Viewed