Gold: భారతీయుల దగ్గరున్న బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లు

by S Gopi |

ఇది మనదేశ జీడీపీలో దాదాపు 125 శాతానికి సమానం కావడం విశేషం.

Gold: భారతీయుల దగ్గరున్న బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లు
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాది జనవరి నాటికి భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ 5 ట్రిలియన్ డాలర్లను దాటిందని ప్రముఖ కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ నివేదిక తెలిపింది. ఇది మనదేశ జీడీపీలో దాదాపు 125 శాతానికి సమానం కావడం విశేషం. బీఎస్ఈ డేటా ప్రకారం, జనవరి చివరి నాటికి ఈ బంగారం విలువ భారత కరెన్సీలో లెక్కిస్తే దాదాపు రూ.445 లక్షల కోట్లకు పైమాటే. ఇది దేశ మార్కెట్ క్యాప్ రూ. 460 లక్షల కోట్ల కంటే కొంచెం తక్కువ. గత కొంతకాలంగా పసిడి ధరల్లో అత్యధిక వృద్ధి కారణంగా కుటుంబాల వద్ద ఉన్న బంగారం విలువ భారీగా పెరిగిందని నివేదిక అభిప్రాయపడింది.

పసిడి కొనుగోళ్ల ద్వారా దేశంలో ప్రజలు బ్యాంకు డిపాజిట్ల వంటి ఆర్థిక పొదుపు నుంచి భౌతిక ఆస్తిని మారడాన్ని సూచిస్తుంది. ప్రస్తుతం భారతీయ కుటుంబాల ఆస్తియేతర సంపదలో బంగారం వాటా దాదాపు 65 శాతంగా ఉంది. వారి డిపాజిట్లు, ఈక్విటీ హోల్డింగ్స్ కలిపి ఉన్న విలువలో ఇది సుమారు 175 శాతంగా ఉంటుందని అంచనా. గత ఐదేళ్లలో బంగారం నిల్వల విలువ నాలుగు రెట్లకు పైగా పెరిగిందని కోటక్ నివేదిక అంచనా వేసింది. ప్రధానంగా దిగుమతుల కారణంగా 2019, మార్చిలో రూ. 109 లక్షల కోట్ల నుంచి 2026, జనవరి నాటికి రూ. 445 లక్షల కోట్లకు ఈ విలువ పెరిగింది.

Next Story