భారత్‌లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ హబ్ అవసరం: ఎయిర్ఇండియా సీఈఓ

by Dishanational1 |
భారత్‌లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్ హబ్ అవసరం: ఎయిర్ఇండియా సీఈఓ
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత విమానయాన పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రముఖ ఎయిర్ఇండియా సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ అన్నారు. భవిష్యత్తులో భారత్‌లో ముంబై, ఢిల్లీ తర్వాత మరొక అంతర్జాతీయ హబ్ అవసరం ఏర్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం గురుగ్రామ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన విల్సన్, భారత్ కనీసం మూడు కేంద్రాలకు, పాయింట్-టూ-పాయింట్ సేవలందించగల సామర్థ్యం ఉందని, ప్రపంచంలోనే భారత్ లాంటి మార్కెట్‌లు ఎక్కువగా లేవన్నారు. 'ఎయిర్ఇండియా ప్రైవేటీకరణ సమయంలో సంస్థ వద్ద 130 కోట్ల జనాభా కలిగిన భారత ప్రజలకు 43 వైడ్-బాడీ విమానాలను మాత్రమే కలిగి ఉంది. అదే సింగపూర్‌లో 150, దుబాయ్‌లో 250 వైడ్-బాడీ విమానాలు ఉన్నాయి. దీన్ని బట్టి దేశంలో విమానయాన పరిశ్రమ వృద్ధికి ఉన్న అవకాశాలను లెక్కించవచ్చు. పూర్తిస్థాయిలో విమానయాన సేవలకు తాము అన్ని రకాల క్లియరెన్స్‌లను అందుకున్నాం. కాబట్టి భవిష్యత్తులో అందుకనుగుణంగా పనిచేస్తామని ' క్యాంప్‌బెల్ విల్సన్ పేర్కొన్నారు. కాగా, ఎయిర్ఇండియా గతేడాది విమానయాన చరిత్రలోనే అతిపెద్ద జెట్ కొనుగోళ్లకు ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగా ఎయిర్‌బస్, బోయింగ్‌ల నుంచి 470 విమానాలను ఆర్డర్ చేసింది.

Next Story