IT Sector: మన ఐటీ రంగంపై ట్రంప్ టారిఫ్?

by S Gopi |

ఐటీ సేవల రంగానికి సంబంధించి ఔట్ సోర్సింగ్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది

IT Sector: మన ఐటీ రంగంపై ట్రంప్ టారిఫ్?
X

దిశ, బిజినెస్ బ్యూరో: భారత వస్తువుల ఎగుమతుల తర్వాత, అమెరికా ఇప్పుడు భారత ఐటీ సేవల ఎగుమతులను లక్ష్యంగా చేసుకుంది. 'హాల్టింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ యాక్ట్' లేదా 'హైర్ యాక్ట్' అనే కొత్త బిల్లును సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఇది సేవల కోసం అమెరికా పన్ను చెల్లింపుదారులు విదేశీయులకు చేసే కొన్ని రకాల చెల్లింపులపై 25 శాతం పన్ను విధించాలని ప్రతిపాదిస్తోంది. భారత ఆర్థికవ్యవస్థకు అధిక భాగం ఎగుమతుల ఆదాయాన్ని అందిస్తున్న ఐటీ సేవల రంగానికి సంబంధించి ఔట్ సోర్సింగ్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ముఖ్యంగా భారత్‌కు చెందిన ఐటీ ఎగుమతులు, కాల్‌ సెంటర్‌లపై పన్నులు విధించవచ్చనే ఊహాగానాలు బలంగా ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ పరిణామాల వల్ల అనిశ్చితిని ఎదుర్కొంటున్న మన ఐటీ రంగంపై ట్రంప్ ప్రభుత్వం టారిఫ్ భారం వేస్తే మరిన్ని సవాళ్లు ఎదురవుతాయనే చర్చ జరుగుతోంది. ఇటీవల ట్రంప్ సలహాదారు పీటర్ నవారో సైతం దీని గురించి స్పందిస్తూ.. విదేశాలకు ఔట్ సోర్సింగ్ చేయడంపై అధిక పన్నులు వేయాలన్నారు.

అయితే, అమెరికాకు ఎక్కువ ఆదాయం అందిస్తున్న ఐటీ రంగంలో ఎటువంటి సేవలపై పన్నులు విధిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అమెరికా పన్నులు విధిస్తే ఐటీ సేవల నిర్వహణపై తీవ్ర ప్రభావం ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. దీనిపై అమెరికా ప్రభుత్వం నుంచి దీనిపై ఎలాంటి నిర్ణయం వెలువడకపోవడంతో కొంత ఆందోళన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే అమెరికాలో అధిక పన్నులు చెల్లిస్తున్న మన ఐటీ కంపెనీలకు అదనపు పన్నులు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా వీసా నిబంధనలు, అమెరికాలోని స్థానికులనే నియమించాలని రూల్స్ అక్కడి కార్యకలాపాలకు ఖర్చుతో కూడిన విషయంగా మారడం కూడా కంపెనీలకు కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. ప్రస్తుతం భారత్‌కు చెందిన ఔట్‌సోర్సింగ్ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్ లాంటి కంపెనీలు ఉండగా, ఈ కంపెనీలకు 60 శాతం మేర ఆదాయం అమెరికా నుంచి వస్తుండటం గమనార్హం. హైర్ యాట్ అమలు చేస్తే అమెరికాకు భారతీయ ఐటీ సేవల ఎగుమతులు ఖరీదు కావచ్చు. భారత సాఫ్ట్‌వేర్ సేవల ఎగుమతుల్లో అమెరికా వాటా 50 శాతం కంటే ఎక్కువగా ఉంది, ఇది 2024-25లో సేవల ఎగుమతులు, క్లయింట్లకు ఉత్పత్తుల అమ్మకాలు వంటి సాఫ్ట్‌వేర్ ఎగుమతులు దాదాపు 225 బిలియన్ డాలర్లు(రూ. 20 లక్షల కోట్లు)గా ఉంది. నాస్కామ్ ప్రకారం, మొత్తం ఐటీ రంగ ఆదాయం 2024-25లో 5.1 శాతం పెరిగి రూ. 282.6 బిలియన్ డాలర్ల(రూ. 25 లక్షల కోట్ల)కు చేరినట్టు అంచనా.

కేంద్ర ఐటీ మంత్రి స్పందన

భారత ఐటీ రంగాన్ని అమెరికా టారిఫ్ బారి నుంచి రక్షించేందుకు ఆ దేశంతో కలిసి మాట్లాడుతున్నట్టు కేంద్ర రైల్వే, ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా ప్రభుత్వం భారత ఔట్‌సోర్సింగ్ కంపెనీలపై టారిఫ్ భారం వేయనుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి వివరణ ఇచ్చారు. భారత్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, ఇతర సేవల నిర్వహణకు చెందిన కంపెనీలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాం. అమెరికాతో పాటు జపాన్, యూరప్, ఆసియా దేశాల ప్రభుత్వాలతోనూ మాట్లాడుతున్నాం. మరోవైపు భారత్ ఐటీ రంగంపైనే ఆధారపడకుండా, ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాల్లోనూ రాణించేలా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ఈ మధ్యలో స్మార్ట్‌ఫోన్ ఎగుమతుల్లో పెరిగిన భారత్ వాటాయే ఇందుకు నిదర్శనమని అన్నారు.

Next Story