NITI Aayog: మూడేళ్లలో జర్మనీ, జపాన్‌ను అధిగమించనున్న భారత ఆర్థికవ్యవస్థ

by S Gopi |

భారత్‌కు ఉన్న ఏకైక ప్రయోజనం ప్రజాస్వామ్య దేశం కావడమేనని ఆయన తెలిపారు.

NITI Aayog: మూడేళ్లలో జర్మనీ, జపాన్‌ను అధిగమించనున్న భారత ఆర్థికవ్యవస్థ
X

దిశ, బిజినెస్ బ్యూరో: వచ్చే మూడేళ్లలో భారత ఆర్థికవ్యవస్థ జర్మనీ, జపాన్‌లను అధిగమిస్తుందని నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం అన్నారు. 2047 నాటికి రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా కూడా అవతరించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ప్రపంచానికి ఎడ్యుకేషన్ హబ్‌గా మారగలదని, ఇతర అంశాలను పక్కనబెడితే, భారత్‌కు ఉన్న ఏకైక ప్రయోజనం ప్రజాస్వామ్య దేశం కావడమేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత ఆర్థికవ్యవస్థ ప్రపంచంలోనే ఐదవ స్థానంలో ఉంది. వచ్చే ఏడాది ఆఖరు నాటికి నాలుగో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఏడాది మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదుగుతుంది. తాజా ఐఎంఎఫ్ డేటా ప్రకారం, భారత ఆర్థికవ్యవస్థ పరిమాణం 4.3 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. మరో మూడేళ్లలో జర్మనీ, జపాన్‌లను అధిగమించి, 2047 నాటికి 30 ట్రిలియన్ డాలర్లతో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా మారుతుంది. ఈ లక్ష్యాలను సాధించేందుకు దేశంలోని న్యాయ, అకౌంటింగ్ సంస్థలు సహా భారతీయ కంపెనీలు ప్రపంచ అగ్రగామిగా ఎదిగేందుకు కృషి చేయాలని సుబ్రహ్మణ్యం కోరారు. మధ్య-ఆదాయ దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు తక్కువ-ఆదాయ దేశాల కంటే భిన్నంగా ఉంటాయి. పేదలకు ఆహారం, దుస్తులు అందించడం కాదు, నాలెడ్జ్ ఎకానమీగా మారేందుకు అవకాశాలు వెతకాలి. జపాన్ 15,000 మంది భారతీయ నర్సులను, జర్మనీ 20,000 మంది హెల్త్‌కేర్ వర్కర్లను భారత్ నుంచి తీసుకెళ్తోంది. దానర్థం వారికి అవసరమైన స్థాయిలో పనిచేసే లేరని, అక్కడ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైందని సుబ్రహ్మణ్యం వివరించారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేసే వారిని సరఫరా అందించగల స్థితిలో భారత్ ఉందని, ఇది మన దేశానికి ఉన్న అతిపెద్ద బలమని ఆయన పేర్కొన్నారు.

Next Story