ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్.. జపాన్‌ను అధిగమించి 4వ స్థానం కైవసం

by Malleboina Mahesh |

భారత ఆర్థిక వ్యవస్థ అద్భుతమైన పురోగతిని సాధిస్తూ.. 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.

ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్.. జపాన్‌ను అధిగమించి 4వ స్థానం కైవసం
X

దిశ, వెబ్ డెస్క్: భారత ఆర్థిక వ్యవస్థ (Indian economy) అద్భుతమైన పురోగతిని సాధిస్తూ.. వేగంగా ముందుకు దూసుకుపోతుంది. ఈ క్రమంలో 4.18 ట్రిలియన్ డాలర్ల జీడీపీ (GDP)తో జపాన్‌ను అధిగమించి ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దశాబ్దం క్రితం పదో స్థానంలో ఉన్న భారత్, నేడు ప్రపంచ వేదికపై అగ్రరాజ్యాలైన అమెరికా, చైనా, జర్మనీల తర్వాతి స్థానంలో నిలిచింది. బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన ఆర్థిక సంస్కరణల వల్ల ఇది సాధ్యమైందని ప్రభుత్వ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial year) రెండో త్రైమాసికంలో భారత్ 8.2 శాతం వృద్ధి రేటును నమోదు చేసి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. తయారీ, నిర్మాణం, సేవా రంగాల్లో వచ్చిన గణనీయమైన మార్పులు, అలాగే స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం ఈ వృద్ధికి ప్రధాన ఇంజన్లుగా నిలిచాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సైతం దేశ ఆర్థిక పురోగతిపై ధీమా వ్యక్తం చేస్తూ తన వృద్ధి అంచనాలను పెంచడం గమనార్హం.

ఇదే వేగంతో ముందుకు సాగితే, రాబోయే రెండున్నర నుంచి మూడేళ్లలో జర్మనీ(Germany)ని సైతం వెనక్కి నెట్టి, 2030 నాటికి 7.3 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన దేశం) గా మారాలన్న సంకల్పంతో చేపడుతున్న డిజిటల్ విప్లవం, మౌలిక సదుపాయాల కల్పన ఈ లక్ష్య సాధనలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఈ నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు సైతం భారత్ వైపు మొగ్గు చూపుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story