భారత్‌కు వచ్చే రెండు దశాబ్దాల్లో భారీగా పైలట్లు అవసరం: బోయింగ్!

by Disha Web Desk 17 |
భారత్‌కు వచ్చే రెండు దశాబ్దాల్లో భారీగా పైలట్లు అవసరం: బోయింగ్!
X

న్యూఢిల్లీ: పెరుగుతున్న ఆర్డర్లను గమనిస్తే రాబోయే 20 ఏళ్లలో భారత్‌కు 31,000 మంది పైలట్లు అవసరమవుతారని అమెరికాకు చెందిన విమానాల తయారీ సంస్థ బోయింగ్ వెల్లడించింది. అదే సమయంలో 26,000 మంది మెకానిక్‌లు కావాలని తెలిపింది. మంగళవారం పరిశ్రమల సంఘం సీఐఐ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన బోయింగ్ ఇండియా అధ్యక్షుడు సలెల్ గుప్తె, వచ్చే 20 ఏళ్లలో దక్షిణాసియా ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలుస్తుందన్నారు.

భారత వృద్ధికి పెరుగుతున్న విమానాల ఆర్డర్‌ చాలా కీలకంగా ఉంటుందని సలీల్ గుప్తె అభిప్రాయపడ్డారు. అలాగే, దేశంలో పెరుగుతున్న విమాన ప్రయాణ రద్దీని బట్టి మౌలిక సదుపాయాలపై మరింత దృష్టి సారించాల్సి ఉంటుందని, ఎయిర్‌పోర్ట్‌లలో మెరుగైన మౌలిక సదుపాయాలు, పైలట్ల లభ్యత ఉండాలన్నారు.

కరోనా మహమ్మారి తర్వాత దేశంలో విమాన ప్రయాణాల డిమాండ్ పుంజుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో తాము అంచనా వేసిన దాని ప్రకారం 2040 నాటికి భారత విమాన ప్రయాణ రద్దీ ఏటా 7 శాతం వృద్ధి సాధిస్తుందని చెప్పారు.

ఇక, దేశంలో బోయింగ్‌కు చెందిన నారో బాడీ ఎయిర్‌క్రాఫ్ట్‌లకు మార్కెట్ ఉంది. మరో 20 ఏళ్లలో 90 శాతం ఈ విమానాలే ఉండనున్నాయని సలీల్ తెలిపారు. కాగా, ఇటీవల టాటా గ్రూపునకు చెందిన ఎయిర్ ఇండియా భారీ సంఖ్యలో 470 విమానాల కోసం బోయింగ్, ఎయిర్‌బస్‌లతో ఒప్పందం చేసుకున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed