అత్యంత విలువైన కంపెనీగా మూడోసారి రిలయన్స్

by Dishanational1 |
అత్యంత విలువైన కంపెనీగా మూడోసారి రిలయన్స్
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో అత్యంత ఆశావహ, విజయవంతమైన 500 కంపెనీల జాబితాను హురున్ ఇండియా విడుదల చేసింది. యాక్సిస్ బ్యాంక్ సహకారంతో రూపొందించిన ఈ జాబితాలో పాత కంపెనీలతో పాటు కొత్తవి కూడా చాలానే ఉన్నాయి. 235 ఏళ్ల నాటికి ఈఐడీ-ప్యారీ నుంచి 2021లో స్థాపించిన స్టార్టప్‌ల వరకు ఉన్నాయి. హురున్ ఇండియా నివేదిక ప్రకారం, రూ. 15.6 లక్షల కోట్లతో రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత్‌లో అత్యంత విలువైన కంపెనీగా ఉంది. రిలయన్స్ సంస్థ అగ్రస్థానంలో కొనసాగడం ఇది మూడో ఏడాది. ఆ తర్వాత టీసీఎస్ రూ. 12.4 లక్షల కోట్లు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ. 11.3 లక్షల కోట్లతో టాప్-3లో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ టాప్-10 జాబితాలోకి తిరిగి వచ్చాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, ఐటీసీ, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలతో ఫైనాన్స్, హెల్త్‌కేర్, కన్స్యూమర్ గూడ్స్, ఐటీ, ఆటోమోటివ్ వరకు అన్ని రంగాల్లో కంపెనీలు ఈ జాబితాలో ర్యాంకులను సాధించాయి. ఇది దేశ ఆర్థికవ్యవస్థలో కనిపించే బహుముఖ వృద్ధిని సూచిస్తుందని హురున్ ఇండియా అభిప్రాయపడింది.

ఈ ఏడాది జాబితాలోకి కొత్తగా 61 కంపెనీలు వచ్చి చేరాయి. పారిశ్రామిక ఉత్పత్తుల రంగం నుంచి అత్యధికంగా 16 ఉండగా, ఆర్థిక సేవల రంగంలో 10 కంపెనీలు ఉన్నాయి. ముఖ్యంగా 437 కంపెనీల బోర్డుల్లో మహిళలు ఉండటం లింగ సమానత్వంలో వస్తున్న మార్పునకు నిదర్శనమని హురున్ ఇండియా అభిప్రాయపడింది. టాప్-500 కంపెనీల మొత్తం విలువ రూ. 231 లక్షల కోట్లు ఉండగా, ఇది చాలా దేశాల జీడీపీల కంటే ఎక్కువ కావడం గమనార్హం. గతేడాది జాబితాలో మొత్తం 36 నగరాల నుంచి కంపెనీలు ఉండగా, ఈసారి 44 నగరాలకు చెందిన కంపెనీలు ర్యాంకులు సాధించాయి. ఈసారి ముంబై, బెంగళూరు లాంటి ప్రధాన ఆర్థిక నగరాల నుంచే కాకుండా త్రిసూర్, కొచ్చి, సూరత్ లాంటి నగరాల నుంచి కూడా కంపెనీలు ఉన్న్నాయి. అందులో ముంబై 156 కంపెనీలతో అగ్రస్థానంలో ఉండగా, బెంగళూరు నుంచి 59, న్యూఢిల్లీ 39 కంపెనీలను కలిగి ఉన్నాయి.

జాబితాలోని స్టార్టప్ కంపెనీలు ఫండింగ్, వాల్యూయేషన్ పరంగా వెనుకబడ్డాయి. ముఖ్యంగా బైజూస్, డీల్‌షేర్, ఫార్మసీ కంపెనీల ప్రభావంతో రూ. 4 లక్షల కోట్లను కోల్పోయాయి. అయితే, అన్ని దేశీయ స్టార్టప్‌లు ప్రతికూలంగా లేవు. మార్కెట్లలో లిస్ట్ అయిన 6 యూనికార్న్ కంపెనీలు సంయుక్తంగా తమ విలువను రూ. 62,837 కోట్ల వృద్ధిని సాధించాయి. అదానీ గ్రూపునకు చెందిన 8 కంపెనీలు ఈ జాబితాలోని మొత్తం కంపెనీల విలువలో 4.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. హురున్ ఇండియా కనిష్టంగా రూ. 6,700 కోట్ల విలువ కలిగిన కంపెనీలతో టాప్-500 జాబితాను రూపొందించింది. ఈ కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు దేశంలోని వ్యవస్థాగత శ్రామికశక్తిలో 1.3 శాతానికి సమానం. ఒక్కో కంపెనీ సగటున 15,211 మంది ఉద్యోగులను కలిగి ఉంది.

హురున్ ఇండియా నివేదికలోని ఇతర కీలక అంశాలు..

* రిలయన్స్ నుంచి వేరుపడటంతో జియో ఫైనాన్షియల్ ఈ జాబితాలో 28వ ర్యాంకును సాధించింది.

* 342 కంపెనీలు గత ఏడాది కాలంలో విలువ పెరుగుదలను సాధించాయి. వీటిలో 18 కంపెనీల విలువ రెట్టింపు కావడం విశేషం. మూడు కంపెనీలు ఏకంగా రూ. లక్ష కోట్లు పెరగడం గమనార్హం.

* వీటిలో సగానికి పైగా కంపెనీలు రూ. వెయ్యి కోట్ల కంటే ఎక్కువ, 75 కంపెనీలు రూ. 10 వేల కోట్ల కంటే ఎక్కువ విలువను పెంచుకున్నాయి.

* మేఘా ఇంజనీర్నింగ్(150 శాతం వృద్ధి), తయారీ సేవల స్టార్టప్ జెట్‌వర్క్(100 శతాం), బెనెట్ కోల్‌మన్(100 శాతం) వంటి అన్‌లిస్టెడ్ కంపెనీలు ఎక్కువ వృద్ధిని సాధించాయి.

* 436 శాతం వృద్ధితో సుజ్లాన్ ఎనర్జీ వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా నిలిచింది. జిందాల్ స్టెయిన్‌లెస్, జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా ఏడాది కాలంలో దాదాపు ఐదు రెట్లు వృద్ధి చెందాయి.


Next Story