Mukhesh Ambani: ఆసియా అత్యంత సంపన్నుడు అంబానీయే

by S Gopi |

గౌతమ్ అదానీ తన సంపదను రూ. లక్ష కోట్లు పెంచుకోవడం ద్వారా భారత రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచారు.

Mukhesh Ambani: ఆసియా అత్యంత సంపన్నుడు అంబానీయే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ గడిచిన ఏడాది కాలంలో వివిధ కారణాలతో భారీగా సంపదను కోల్పోయారు. డేటా ప్రకారం.. ఖర్చులు, అప్పుల కారణంగా ఆయన సంపద రూ. లక్ష కోట్లకు పైనే క్షీణించింది. అయితే, తాజా హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో మొదటి 10 మందిలో స్థానం కోల్పోయినప్పటికీ, ఆసియాలోనూ, దేశీయంగానూ అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. గురువారం విడుదలైన హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-2025 నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో మరో బిలియనీర్ అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీ మాత్రం తన సంపదను రూ. లక్ష కోట్లు పెంచుకోవడం ద్వారా భారత రెండో అత్యంత సంపన్నుడిగా ముఖేశ్ అంబానికి అడుగు దూరంలో నిలిచారు. అంతేకాకుండా ఏడాది కాలంలో సంపదను 13 శాతం పెంచుకోవడం ద్వారా దేశంలో అత్యధిక సంపదను పోగు చేసుకున్న వ్యక్తిగా మారారు. ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ముఖేశ్ అంబానీ సంపద 13 శాతం క్షీణించినప్పటికీ, రూ. 8.6 లక్షల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత అదానీ రూ. 8.4 లక్షల కోట్లతో(13 శాతం వృద్ధి) రెండో స్థానంలో ఉన్నారు.

భారత టాప్-10 జాబితాలో చేరిన ఒకే ఒక మహిళ

ఇక హెచ్‌సీఎల్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ రూ. 3.5 లక్షల కోట్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు. తండ్రి శివ్‌నాడార్ నుంచి వారసత్వంగా హెచ్‌సీఎల్ సంస్థలో 47 శాతం వాటా బదిలీ కారణంగా ఆమె భారత టాప్-10 జాబితాలో చేరిన ఒకే ఒక మహిళగా నిలిచారు. అంతేకాకుండా టాప్-10 ప్రపంచ సంపన్న మహిళల జాబితాలోనూ(ఐదో స్థానం) చోటు సంపాదించారు. ఆమె తర్వాత సన్ ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వి సంపద 21 శాతం పెరగడంతో రూ. 2.5 లక్షల కోట్లతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఐదో స్థానంలో రూ. 2.2 లక్షల కోట్లతో అజిమ్ ప్రేమ్‌జీ, రూ. 2 లక్షల కోట్లతో కుమార మంగళం బిర్లా, రూ. 2 లక్షల కోట్లతో సైరస్ పూనావాలా, రూ. 1.6 లక్షల కోట్లతో నీరజ్ బజాజ్, రూ. 1.4 లక్షల కోట్లతో రవి జైపూరియా, రూ. 1.4 లక్షల కోట్లతో రాధాకిషన్ దమానీ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రపంచ సంపన్నుల జాబితాలో టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ సంపద 82 శాతం పెరగడంతో 420 బిలియన్‌ డాలర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. 266 బిలియన్‌ డాలర్లతో అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ రెండో స్థానంలో ఉన్నారు. మెటా సీఈవో జుకర్‌బర్గ్‌ 242 బిలియన్‌ డాలర్లతో మూడో స్థానంలో, తర్వాతి స్థానాల్లో ఒరాకిల్‌ సీఈవో లారీ ఎల్లిసన్‌, ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌, గూగుల్‌ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌ ఉన్నారు.

దేశీయ బిలియనీర్ హబ్‌గా ముంబై

గతేడాది కాలంలో దేశీయంగా 13 మంది కొత్త బిలియనీర్లు పుట్టుకొచ్చారు. ఫలితంగా భారత్‌లో మొత్తం 284 మంది బిలియనీర్లు ఉన్నారు. భారతీయ బిలియనీర్ల మొత్తం సంపద రూ. 98 లక్షల కోట్లు ఉండగా, ఇది భారత జీడీపీలో దాదాపు మూడింట ఒక వంతు. అంతేకాకుండా సౌదీ అరేబియా మొత్తం జీడీపీ కంటే ఎక్కువ కావడం విశేషం. ముంబై 90 మందితో దేశీయ బిలియనీర్ హబ్‌గా నిలిచింది. దేశంలోని బిలియనీర్ల సగటు సంపద రూ. 34,514 కోట్లు. ఇది చైనా రూ. 29,027 కోట్ల కంటే ఎక్కువ. అతి పిన్న వయస్కులైన బిలియనీర్లుగా శశాంక్ కుమార్, హర్షిల్ మాథుర్ (రేజర్‌పే) నిలిచారు. వీరిద్దరికీ 34 ఏళ్ల వయస్సు కాగా, వీరి సంపద రూ. 8,643 కోట్లు. రూ. 9 లక్షల కోట్ల సంపదతో 22 మంది భారతీయ మహిళలు ఈ జాబితాలో ఉన్నారు. భారతీయ బిలియనీర్ల సంపద ఏడాదిలో 10 శాతం పెరిగింది. ఈ వృద్ధి చైనాలో 9 శాతం, యూఎస్‌లో 27 శాతంగా ఉంది.

బిలియనీర్లు ఎక్కువగా ఉన్న రంగాలు

ఆరోగ్య సంరక్షణ: 53 మంది

వినియోగ వస్తువులు: 35 మంది

పారిశ్రామిక ఉత్పత్తులు: 32 మంది

Next Story