సగటున 4.1 శాతం పెరిగిన ఇళ్ల అద్దెలు!

by Disha Web Desk 17 |
సగటున 4.1 శాతం పెరిగిన ఇళ్ల అద్దెలు!
X

న్యూఢిల్లీ: అద్దె ఇళ్లకు క్రమంగా గిరాకీ పెరుగుతున్న కారణంగా దేశంలో ప్రధాన నగరాల్లో ఇంటి అద్దెలు వేగంగా పెరుగుతున్నాయి. ఆయా నగరాల్లో ఇళ్ల సరఫరాల కంటే గిరాకీ ఎక్కువగా ఉందని, గత మూడు నెలల కాలంలో ధరలు మరింత అధికంగా పెరిగాయని తాజా నివేదికలో తేలింది. ప్రముఖ స్థిరాస్తి మార్కెట్ ప్లేస్ మ్యాజిక్‌బ్రిక్స్ డేటా ప్రకారం, ఈ ఏడాది జనవరి-మార్చిలో దేశంలోని ప్రధాన 13 నగరాల్లో అంతకుముందు కంటే సగటున 4.1 శాతం అద్దెలు పెరిగాయి. గురుగ్రామ్, నోయిడా, హైదరాబాద్, ముంబై వంటి నగరాల్లో ఎక్కువగా పెరిగాయి.

మొత్తం 13లో 11 నగరాల్లో ఇళ్ల అద్దెలు పెరగ్గా, థానే, అహ్మదాబాద్‌లలో మాత్రమే స్వల్పంగా తగ్గాయి. గత కొన్ని నెలల వ్యవధిలో డిమాండ్-సరఫరా మధ్య అంతరం ఎక్కువగా ఉండటంతో అద్దెలు క్రమంగా పెరిగాయి.

సమీక్షించిన కాలంలో గురుగ్రామ్‌లో అత్యధికంగా 8.3 శాతం ఇళ్ల అద్దెలు ఖరీదయ్యాయి. ఆ తర్వాత నోయిడా(5.1 శాతం), హైదరాబాద్(4.9 శాతం), ముంబై(4.2 శాతం), బెంగళూరు(3.9 శాతం), పూణె(2.9 శాతం), గ్రేటర్ నోయిడా(2.7 శాతం), కోల్‌కతా(2 శాతం), నవీ ముంబై(1.4 శాతం), చెన్నై(1.3 శాతం), ఢిల్లీ(0.7 శాతం) పెరిగాయి.

అహ్మదాబాద్(0.8 శాతం), థానె(0.5 శాతం) క్షీణించాయి. రెంటల్ హౌసింగ్ మార్కెట్ మెరుగైన పునరుద్ధరణను చూస్తోందని, రానున్న త్రైమాసికాల్లో ఈ ధోరణి కొనసాగుతుందని మ్యాజిక్‌బ్రిక్స్ సీఈఓ సుధీర్ పయ్ పేర్కొన్నారు.

Also Read.

చివరి గంట వరకు ఉత్కంఠ.. ఆఖరికి స్వల్ప లాభాలతో సరిపెట్టిన స్టాక్ మార్కెట్లు!

Next Story