గల్ఫ్ యుద్ధం : భగ్గుమన్న పసిడి.. రికార్డు స్థాయిలో వెండి!

by Ramesh Naini |

గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను వణికించడమే కాకుండా, సామాన్యుడికి బంగారం, వెండిని మరింత దూరం చేస్తోంది.

గల్ఫ్ యుద్ధం : భగ్గుమన్న పసిడి.. రికార్డు స్థాయిలో వెండి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: గల్ఫ్ దేశాల్లో నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ మార్కెట్లను వణికించడమే కాకుండా, సామాన్యుడికి బంగారం, వెండిని మరింత దూరం చేస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో గడిచిన 24 గంటల్లో పసిడి ధరలు భగ్గుమన్నాయి. కేవలం ఒక్క రోజులోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.7 వేల మేర ఎగబాకడం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

రికార్డు స్థాయిలో బంగారం ధరలు..

హైదరాబాద్ మార్కెట్‌లో ప్రస్తుతం ధరల పరిస్థితి తీసుకుంటే.. 24 క్యారెట్ల బంగారం.. 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,73,500 కు చేరింది (ఒక్కరోజే రూ. 7,000 పెంపు). 22 క్యారెట్ల బంగారం.. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 6,550 పెరిగి, రూ. 1,54,650 వద్ద కొనసాగుతోంది.

మూడు లక్షల మార్కు దాటిన వెండి..

బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఒక్కరోజే ఏకంగా రూ. 25,000 పెరగడంతో, కిలో వెండి ధర మళ్లీ 3 లక్షల మైలురాయిని దాటింది. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 3,20,000 పలుకుతోంది.

ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు

అమెరికా, ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలే ఈ భారీ పెరుగుదలకు ప్రధాన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్సు ధర 5,296 డాలర్లకు చేరగా, వెండి ఔన్సు ధర 93.82 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గల్ఫ్ యుద్ధం గనుక మరింత ముదిరితే, ఈ ధరలు మరిన్ని రికార్డులను తిరగరాసే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Next Story