GST: సబ్‌స్క్రిప్షన్ క్యాబ్ యాప్‌లకు జీఎస్టీ షాక్

by S Gopi |

ఓలా, ఉబర్ లాంటి ‘కమీషన్’ యాప్‌ల కోసం తెచ్చిన 5 శాతం జీఎస్‌టీ నిబంధనను, కేవలం సాఫ్ట్‌వేర్ ఫీజు మాత్రమే వసూలు చేసే ర్యాపిడో లాంటి ‘సబ్‌స్క్రిప్షన్’ యాప్‌లకు కూడా బలవంతంగా వర్తింపజేయాలని ప్రభుత్వం చూడటమే ఈ సమస్యకు కారణం.

GST: సబ్‌స్క్రిప్షన్ క్యాబ్ యాప్‌లకు జీఎస్టీ షాక్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ర్యాపిడో, భారత్ టాక్సీ వంటి సబ్‌స్క్రిప్షన్ ఆధారిత రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్‌లపై జీఎస్టీ విధిస్తే, దాని ప్రభావం నేరుగా డ్రైవర్లు, ప్రయాణికులపై పడే అవకాశం ఉందని ఈస్యా సెంటర్ తాజా నివేదిక హెచ్చరించింది. 13 నగరాల్లో 2,100 మందికి పైగా డ్రైవర్లు, ప్రయాణికుల అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన ఈ అధ్యయనం ప్రకారం, ఈ ప్లాట్‌ఫామ్‌లలో డ్రైవర్లు నెలవారీ లేదా నిర్ణీత సబ్‌స్క్రిప్షన్ ఫీజు చెల్లించి కస్టమర్లను చేర్చుకుంటున్నారు. ప్రయాణ ఛార్జీని డ్రైవర్, ప్రయాణికుడు నేరుగా నిర్ణయించుకుంటారు. ప్లాట్‌ఫామ్‌కు ఆ డబ్బుతో సంబంధం ఉండదు. ఇదే ఉబర్, ఓలా వంటి కమీషన్ మోడల్‌కు ఇది పూర్తీగా భిన్నం. అక్కడ ప్లాట్‌ఫామ్‌నే ఛార్జీని నిర్ణయించి, చెల్లింపులు వసూలు చేసి, తన కమీషన్ తీసుకుని మిగిలిన మొత్తాన్ని డ్రైవర్‌కు చెల్లిస్తుంది. అందుకే రెండు బిజినెస్ మోడల్స్‌ను ఒకే విధంగా జీఎస్టీ పరిధిలోకి తేవడం ఆచరణలో సమస్యలు సృష్టించవచ్చని నివేదిక పేర్కొంది. ఓలా, ఉబర్ లాంటి ‘కమీషన్’ యాప్‌ల కోసం తెచ్చిన 5 శాతం జీఎస్‌టీ నిబంధనను, కేవలం సాఫ్ట్‌వేర్ ఫీజు మాత్రమే వసూలు చేసే ర్యాపిడో లాంటి ‘సబ్‌స్క్రిప్షన్’ యాప్‌లకు కూడా బలవంతంగా వర్తింపజేయాలని ప్రభుత్వం చూడటమే ఈ సమస్యకు కారణం.

నివేదిక ప్రకారం, ప్రస్తుతం అమల్లో ఉన్న సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 9(5) కమీషన్ ఆధారిత అగ్రిగేటర్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. కానీ సబ్‌స్క్రిప్షన్ మోడల్‌లో ప్లాట్‌ఫామ్‌లు ఛార్జీలను నిర్ణయించవు, చెల్లింపులు కూడా తీసుకోవు. అలాంటప్పుడు తమ చేతికి రాని డబ్బుపై జీఎస్టీని వాటిపై మోపడం సరైన విధానం కాదని ఈస్యా సెంటర్ అభిప్రాయపడింది. అంతేకాదు, ఈ మోడల్‌లో పనిచేసే చాలా మంది డ్రైవర్ల వార్షిక ఆదాయం రూ.20 లక్షల జీఎస్టీ రిజిస్ట్రేషన్ పరిమితి కంటే తక్కువగానే ఉంటుందని గుర్తు చేసింది. కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్ (ఏఏఆర్) ఇచ్చిన భిన్నమైన తీర్పులు పరిశ్రమలో మరింత అనిశ్చితికి దారితీశాయని కూడా నివేదిక పేర్కొంది.

Next Story