GST:మరోసారి రికార్డు స్థాయి జీఎస్టీ ఆదాయం!

by Disha Web Desk 17 |
GST:మరోసారి రికార్డు స్థాయి జీఎస్టీ ఆదాయం!
X

న్యూఢిల్లీ: భారత వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. ప్రస్తుత ఏడాది ఆగస్టు నెలకు సంబంధించి జీఎస్టీ వసూళ్లు రూ. 1.43 కోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇది గత ఏడాది ఆగస్టు తో పోలిస్తే 28 శాతం పెరగడం విశేషం. అదేవిధంగా అంతకుముందు జులై నెలతో పోలిస్తే 4 శాతం పెరిగాయి. ముఖ్యంగా డిమాండ్ పుంజుకోవడం, అధిక వడ్డీ రేట్ల వంటి పరిణామాలతో జీఎస్టీ ఆదాయం పెరిగింది.

గతేడాది ఇదే నెలలో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ. 1,12,020 కోట్లు రాగా, జీఎస్టీ వసూళ్లు రూ. 1.40 కోట్ల కంటే ఎక్కువ రావడం ఇది వరుసగా ఆరో నెల కావడం విశేషం. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, సమీక్షించిన నెలలో మొత్తం జీఎస్టీ ఆదాయం రూ. 1,43,612 కోట్లుగా నమోదవగా, ఇందులో సీజీఎస్టీ రూ. 24,710 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ. 30,951 కోట్లుగా ఉన్నాయి.

ఐజీఎస్టీ ద్వారా రూ. 77,782 కోట్లు(వస్తువుల దిగుమతిపై వసూలైన రూ. 42,067 కోట్లతో కలిపి), సెస్‌ల రూపంలో మరో రూ. 10,168 కోట్లు(వస్తువుల దిగుమతులపై రూ.1,018 కోట్లు) వసూలైనట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. వస్తు, సేవల పన్ను ఆదాయంలో తెలుగు రాష్ట్రాలు మెరుగైన వృద్ధిని సాధించాయి.

ఆగస్టులో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు రూ. 3,526 కోట్ల నుంచి రూ. 3,871 కోట్లకు పెరిగాయి. ఇది 10 శాతం వృద్ధి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో 22 శాతం వృద్ధితో రూ. 3,173 కోట్ల ఆదాయం సమకూరింది.



Next Story

Most Viewed