CAFE-III: కార్లకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు

by S Gopi |

2027-28 నుంచి 2031-32 మధ్య భారత్‌లో తయారయ్యే లేదా దిగుమతి అయ్యే ఎం1 కేటగిరీ ప్యాసింజర్ కార్లకు (డ్రైవర్‌తో కలిపి గరిష్టంగా తొమ్మిది మంది ప్రయాణించే వాహనాలు) ఇవి వర్తిస్తాయి.

CAFE-III: కార్లకు కొత్త ఇంధన సామర్థ్య నిబంధనలు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ (కేఫ్-3) నిబంధనల ముసాయిదాను విడుదల చేసింది. 2027 మార్చి 31తో ముగియనున్న ప్రస్తుత కేఫ్-2 స్థానంలో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 2027-28 నుంచి 2031-32 మధ్య భారత్‌లో తయారయ్యే లేదా దిగుమతి అయ్యే ఎం1 కేటగిరీ ప్యాసింజర్ కార్లకు (డ్రైవర్‌తో కలిపి గరిష్టంగా తొమ్మిది మంది ప్రయాణించే వాహనాలు) ఇవి వర్తిస్తాయి. ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను దశలవారీగా కట్టడి చేయడం ఈ కొత్త నిబంధనల ప్రధాన లక్ష్యం. ఈ ముసాయిదాపై పరిశ్రమలు, ప్రజల నుంచి ఆగస్టు 6 వరకు సూచనలు స్వీకరిస్తామని ప్రభుత్వం తెలిపింది.

కొత్త నిబంధనల ప్రకారం కార్ల ఇంధన సామర్థ్య లక్ష్యాలను ప్రతి ఏడాది క్రమంగా కఠినతరం చేయనున్నారు. 2027-28లో 100 కిలోమీటర్లకు 3.996 లీటర్ల ఇంధన వినియోగ లక్ష్యాన్ని, 2031-32 నాటికి 3.3273 లీటర్లకు తగ్గించాలని ప్రతిపాదించారు. అదే సమయంలో కార్బన్ ఉద్గారాలను 94.76 గ్రాముల సీఓ2/కిమీ నుంచి 78.90 గ్రాముల సీఓ2/కిమీకి తగ్గించే లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో ఆటోమొబైల్ కంపెనీలకు మరింత ఇంధన సామర్థ్యం ఉన్న మోడళ్లను అభివృద్ధి చేయడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ లభిస్తుంది. మరో కీలక మార్పుగా, ఇథనాల్, బయో-ఫ్యూయల్స్, కంప్రెస్డ్ బయో-గ్యాస్ (సీబీజీ) వినియోగానికి తొలిసారిగా కార్బన్ న్యూట్రాలిటీ ప్రయోజనాలను లెక్కించనున్నారు. అలాగే, ఇంధన పొదుపు టెక్నాలజీలను ఉపయోగించే తయారీదారులకు కంప్లయన్స్‌లో అదనపు ప్రయోజనాలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో పరిశ్రమలో స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతల వినియోగం మరింత వేగం కానుంది.

Next Story