మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి : మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రం

by Muthe.Rajitha |

మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలని మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజ్ఞప్తి చేసింది.

మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలి :  మహేష్ కుమార్ గౌడ్‌కు వినతిపత్రం
X

దిశ, తెలంగాణ బ్యూరో : మహిళలకు పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే అమలు చేయాలని మహిళా రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం మహిళా సంఘాల ప్రతినిధులు గాంధీభవన్ లో మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. మహిళా రిజర్వేషన్ల అమలును జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (డిలిమిటేషన్)తో అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ, రాజ్యాంగ సవరణ ద్వారా ఆ షరతులను తొలగించి వెంటనే అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వారు కోరారు. ఈ డిమాండ్ గతంలోనూ మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తావించిన విషయమేనని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్లు స్వతంత్ర అంశమని, వాటిని ఇతర రాజకీయ లేదా పరిపాలనా ప్రక్రియలకు అనుసంధానం చేయడం వల్ల అమలు మరింత ఆలస్యమవుతుందని జేఏసీ అభిప్రాయపడింది.

రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్లను జనగణన, డిలిమిటేషన్ నుంచి వేరు చేసే సవరణను తీసుకురావాలని, ఒక మూడవ వంతు రిజర్వేషన్లను వెంటనే అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంట్‌లో చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యం ప్రస్తుతం చాలా తక్కువగా ఉందని, త్వరలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ల అమలు అత్యవసరమని జేఏసీ పేర్కొంది. ఈ వినతిపత్రంపై ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్. అరుణ జ్యోతి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి, పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు అనసూయ, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్. జ్యోతి, పీఓడబ్ల్యూ-2 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వరూప, సీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. జ్యోతి సంతకాలు చేశారు.

Next Story