వచ్చే నెలలో ఐడీబీఐ బ్యాంకు వాటా విక్రయానికి ఈఓఐ జారీ!

by Disha Web Desk 7 |
వచ్చే నెలలో ఐడీబీఐ బ్యాంకు వాటా విక్రయానికి ఈఓఐ జారీ!
X

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయం కోసం ప్రభుత్వం వచ్చే నెలలో ప్రాథమిక బిడ్లను ఆహ్వానించే అవకాశం ఉందని, దీనికోసం ఆర్‌బీఐతో చర్చలు చివరి దశలో ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. ఆర్‌బీఐతో పాటు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాతో చర్చించాలైన కొన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ ప్రక్రియ ముగిసి సెప్టెంబర్ నాటికి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ని జారీ చేసే అవకాశాలున్నాయని అధికారి పేర్కోన్నారు. అయితే, ప్రభుత్వం బ్యాంకు, ఆర్‌బీఐ, సెబీలతో చర్చలు జరుపుతున్న అంశాల గురించి అధికారులు వెల్లడించలేదు.

బ్యాంకింగ్ రంగంలో ప్రైవేటీకరణకు సంబంధించి ఐడీబీఐ బ్యాంకు మొదటిస్థానంలో ఉంది. ఈఓఐ జారీ చేసిన తర్వాత కూడా పెట్టుబడిదారుల నుంచి సందేహాలు ఉత్పన్నమవుతాయని భావిస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోపు బ్యాంకు వాటా విక్రయ ప్రక్రియ ముగిసే అవకాశంలేదని సదరు అధికారి వివరించారు. గతేడాది మేలో ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడుల ఉపసంహరణకు, నిర్వహణ నియంత్రణ బదిలీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ప్రస్తుతానికి బ్యాంకులో ప్రభుత్వానికి 45.48 శాతం వాటా ఉంది. బ్యాంకు ప్రమోటర్‌గా ఉన్న ఎల్ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. గతవారంలోనే ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం కనీసం 51 శాతం వాటా విక్రయించే అవకాశం ఉన్నట్టు సంబంధిత వర్గాల నుంచి వినిపించింది. ఇందులో ప్రభుత్వం, ఎల్ఐసీ ఎంత మొత్తం మేర విక్రయించాలనే దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం.


Next Story

Most Viewed