PAN 2.0: ఎల్‌టీఐమైండ్‌ట్రీ చేతికి పాన్ 2.0 ప్రాజెక్ట్‌ పనులు

by S Gopi |

ఈ ప్రాజెక్టును వచ్చే 18 నెలల్లో పూర్తి చేయనున్నారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి.

PAN 2.0: ఎల్‌టీఐమైండ్‌ట్రీ చేతికి పాన్ 2.0 ప్రాజెక్ట్‌ పనులు
X

దిశ, బిజినెస్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్‌ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 792 కోట్ల కాంట్రాక్ట్ విలువతో ఈ ప్రాజెక్ట్ పనులను ప్రముఖ కన్సల్టింగ్‌, డిజిటల్‌ సొల్యూషన్స్‌ సంస్థ ఎల్‌టీఐమైండ్‌ట్రీకి అప్పగిస్తున్నట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. ఈ ప్రాజెక్టును వచ్చే 18 నెలల్లో పూర్తి చేయనున్నారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. పాన్ 2.0లో భాగంగా సేవల నాణ్యతను మెరుగుపరచడం, వేగవంతమైన సేవల డెలివరీ, ఫిర్యాదుల పరిష్కారాలను మెరుగుపరచడానికి పాన్, టాన్ ప్రక్రియలను సులభతరం చేయనున్నారు. ఇది పాన్, ట్యాన్‌కి సంబంధించిన విషయాలను సమగ్రంగా నిర్వహిస్తుంది. వీటిలో పాన్, టాన్ కేటాయింపు, అప్‌డేట్, ఆధార్-పాన్ లింకింగ్, ఆన్‌లైన్‌ పాన్‌ వ్యాలిడేషన్‌ మొదలైన వాటిని ఒక్క చోటే లభించేలా రూపొందిస్తారు. ప్రస్తుతం మూడు వేర్వేరుగా ఉన్న పోర్టల్‌లు ఏకీకృతం అవుతాయి. కాగా, గతేడాది కేంద్రం పాన్‌ను అన్ని ప్రభుత్వ సంస్థల డిజిటల్ వ్యవస్థల్లోనూ సాధారణ గుర్తింపు కిందకు మార్చేందుకు గానూ పాన్ 2.0 ప్రాజెక్టును ప్రకటించింది. దీనికోసం పలు కంపెనీలు బిడ్డింగ్‌లు వేయగా, ఎల్‌టీఐమైండ్‌ట్రీ రూ. 792 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

Next Story