బంగారం ధరల్లో కొత్త రికార్డులు.. పది గ్రాములు రూ. 70 వేలపైనే

by Dishanational1 |
బంగారం ధరల్లో కొత్త రికార్డులు.. పది గ్రాములు రూ. 70 వేలపైనే
X

దిశ, బిజినెస్ బ్యూరో: దేశంలో బంగారం ధరలు బ్రేకుల్లేకుండా పరిగెడుతున్నాయి. సోమవారం పసిడి కొత్త రికార్డు స్థాయికి చేరింది. సోమవారం సాయంత్రానికి హైదరాబాద్‌లో మార్కెట్లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల బంగారం ఒక్కరోజే దాదాపు రూ. వెయ్యి పెరిగి రూ. 69,400కి చేరుకుంది. అన్ని రకాల పన్నులు కలుపుకుంటే మార్కెట్లో బంగారం ధర తులం రూ. 70,830కి పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ల పరిణామాల ప్రభావం మన మార్కెట్లపై కూడా పడుతోంది. ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 850 పెరిగి రూ. 63,600 వద్ద ఉంది. గ్లోబల్ మార్కెట్లలో సైతం పసిడి ఔన్స్ 2,265.73 డాలర్లకు పెరిగింది. ఇక, వెండి కూడా సోమవారం కిలో రూ. 81,600కు చేరుకుంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం పరిశీలిస్తే.. ముంబైలో రూ. 69,380, న్యూఢిల్లీలో రూ. 69,530, చెన్నైలో రూ. 70,420, బెంగళూరులో రూ. 69,380, కోల్‌కతాలో రూ. 69,380గా ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన స్థాయిలోనే ఉండటం, కొత్త ఆర్థిక సంవత్సరంలో జూన్ నుంచి వడ్డీ రేట్లు తగ్గుతాయనే అంచనాల మధ్య బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. చైనా, అంతర్జాతీయ మార్కెట్లలోనూ పసిడికి గిరాకీ పెరగడం ఇందుకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


Next Story

Most Viewed