మళ్లీ రూ. 60 వేల మార్క్‌కు చేరిన బంగారం ధరలు!

by Disha Web Desk 17 |
మళ్లీ రూ. 60 వేల మార్క్‌కు చేరిన బంగారం ధరలు!
X

న్యూఢిల్లీ: గత ఏడాది ప్రారంభం నుంచి అధిక ద్రవ్యోల్బణం, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్లు బలహీనంగా ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. దానివల్ల ప్రజలు చాలామంది బంగారంలో పెట్టుబడికి ఆసక్తి చూపించారు. అంతర్జాతీయంగా కూడా పసిడి ధరలు పుంజుకోవడంతో దేశీయంగా ధరలు గరిష్ఠాల వద్దే కొనసాగింది.

గతంలో 2023 చివరి నాటికి బంగారం ధర రూ. 60 వేలకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. అయితే, మార్చి నాటికే దాన్ని చేరుకోవడం, దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు బలహీనంగా ఉండటంతో పసిడి ధరలు 2023లో రూ. 70 వేలను తాకవచ్చని అభిప్రాయపడ్డారు.

గత కొన్ని వారాలుగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుతున్న సూచనలు కనిపించినప్పటికీ 2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏకంగా రూ. 60,000 రికార్డు మార్కును చేరుకుంది. శుక్రవారం నాటికి హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ. 330 పెరిగి రూ. 60 వేల వద్ద ఉంది. ప్రజలు వినియోగించే ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల పది గ్రాముల పసిడి రూ. 300 పెరిగి రూ. 55,000కు చేరింది.

వెండి కూడా కిలోకు రూ. 1,300 పెరిగి రూ. 77,500కు పెరిగింది. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల పసిడి ధరలను పరిశీలిస్తే ముంబైలో రూ. 60 వేలు, న్యూఢిల్లీలో రూ. 60,150, బెంగళూరులో రూ. 60,050, చెన్నైలో రూ. 60,980, కోల్‌కతా, పూణెల్లో రూ. 60 వేలుగా ఉంది.


Next Story

Most Viewed