30 శాతం తగ్గిన బంగారం దిగుమతులు!

by Disha Web Desk 13 |
30 శాతం తగ్గిన బంగారం దిగుమతులు!
X

న్యూఢిల్లీ: కరెంటు ఖాతా లోటుపై నేరుగా ప్రభావం చూపే బంగారం దిగుమతులు దాదాపు 30 శాతం తగ్గి 31.8 బిలియన్ డాలర్ల(సుమారు రూ. 2.60 లక్షల కోట్ల)కు చేరుకున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలిపాయి. అధిక కస్టమ్స్ సుంకంతో పాటు ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య 2022-23 ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో పసిడి దిగుమతులు 30 శాతం పడిపోయాయని డేటా వెల్లడించింది. అంతకుముందు 2021-22, ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య బంగారం దిగుమతులు 45.2 బిలియన్ డాలర్లు(రూ. 3.7 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. 2022, ఆగష్టు నుంచే పసిడి దిగుమతులు ప్రతికూలంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అదేవిధంగా సమీక్షించిన కాలంలో వెండి దిగుమతులు 66 శాతం పెరిగి రూ. 44 వేల కోట్లకు చేరుకున్నాయి. అయితే, బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గినప్పటికీ దేశ వాణిజ్య లోటును తగ్గించడంలో సహాయపడలేదు. సమీక్షించిన కాలంలో సరుకుల వాణిజ్య లోటు 247.52 బిలియన్ డాలర్లు(రూ. 20.25 లక్షల కోట్ల)గా ఉంటుందని అంచనా. ఇది 2021-22 నాటి 172.53 బిలియన్ డాలర్ల(రూ. 14.20 లక్షల కోట్లుగా నమోదైంది.

Next Story

Most Viewed