UN: ధనిక, పేద దేశాల మధ్య మరింత పెరుగుతున్న అంతరం

by S Gopi |

కీలక సంస్కరణలు చాలా వరకు అమలు కాకపోవడంతో, ధనిక, పేద దేశాల మధ్య అంతరం మరింత ఎక్కువగా ఉందని తాజా నివేదికలో పేర్కొంది.

UN: ధనిక, పేద దేశాల మధ్య మరింత పెరుగుతున్న అంతరం
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయంగా ధనిక, పేద దేశాల మధ్య అంతరం ఇంకా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక సంస్థల్లో జరుగుతున్న మార్పులతో సహా, గతేడాది అనేక దేశాలు వాగ్దానం చేసిన కీలక సంస్కరణలు చాలా వరకు అమలు కాకపోవడంతో, ధనిక, పేద దేశాల మధ్య అంతరం మరింత ఎక్కువగా ఉందని తాజా నివేదికలో పేర్కొంది. ఈ సందర్భంగా 2030 నాటికి పేదలను అభివృద్ధిలోకి తీసుకురావాలనే 2015 నాటి ఐక్యరాజ్యసమితి లక్ష్యాలను నివేదిక ప్రస్తావించింది. దీనికోసం పని చేయాలని గతేడాది జరిగిన సమావేశంలోనూ అన్ని దేశాలు తీర్మానం చేశాయి.

తొలిసారి పేద దేశాలకు తగ్గిన ఆర్థిక సాయం

ఈ సందర్భంగా ప్రపంచ వృద్ధిని పెంచేందుకు తమ సంస్థ చర్యలు సిద్ధం చేస్తోందని, అయితే ఇరాన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక దృక్పథానికి సవాలుగా మారిందని ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా అన్నారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు ఇంకా పెరుగుతున్నాయి. ఫలితంగా ఆయా దేశాలు ఆర్థిక వనరులను, పెట్టుబడులను సాధించడంలో వెనుకబడతాయి. అంతర్జాతీయ సహకారం తగ్గుముఖం పడుతుంది. ఈ పరిణామాల వల్ల 2025లో పేద దేశాల సహాయానికి కేటాయించే నిధులను 25 దేశాలు తగ్గించేశాయి. ఈ స్థాయిలో పేద దేశాలకు ఆర్థిక సాయం తగ్గడం ఇదే మొదటిసారి. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా 59 శాతం పేద దేశాలకు అందించే సాయం తగ్గించింది. ఈ ఏడాది కూడా ఈ ఆర్థిక సహాయం మరో 5.8 శాతం క్షీణించవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ లీ జున్‌హువా అభిప్రాయపడ్డారు.

ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన అధిక టారిఫ్ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలను ఎక్కువ దెబ్బతీసింది. ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న అత్యంత పేద దేశాల ఎగుమతులపైనా టారిఫ్ 9 శాతం నుంచి 28 శాతానికి పరిగాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ఎగుమతులపై విధించిన టారిఫ్ 2 శాతం నుంచి 19 శాతానికి పెరిగాయని నివేదిక పేర్కొంది.

Next Story