ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై దివాలా ప్రక్రియ!

by Disha Web Desk 17 |
ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై దివాలా ప్రక్రియ!
X

ముంబై: ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌పై దివాలా పరిష్కార ప్రక్రియను ప్రారంభించేందుకు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) బుధవారం ఆదేశించినట్టు కంపెనీ తన ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. దాంతో కంపెనీ చెల్లించని బకాయిలను తిరిగి పొందడానికి సంస్థను వేలం వేయవలసి ఉంటుంది. ట్రిబ్యునల్ ఇప్పటికే రుణాలను సెటిల్ చేసేందుకు రెండున్నర నెలల కంటే ఎక్కువ సమయం ఇచ్చింది. అయితే, ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ ఆ ప్రక్రియలో విఫలమైనందున, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తాజా నిర్ణయం తీసుకున్నట్టు ట్రైబ్యునల్‌ పేర్కొంది.

విజయవంతమైన బిడ్డర్‌కు విక్రయించబడే వరకు కంపెనీ వ్యవహారాలను చూసుకునేందుకు ఇంటరిమ్ రిజల్యూషన్ ప్రొఫెషనల్(ఐఆర్‌పీ)గా జితేందర్ కొఠారీని ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్ నియమించింది. ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 1.58 కోట్లు చెల్లించడంలో విఫలమైందని న్యూఢిల్లీకి చెందిన ఫోర్‌సైట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. గతేడాది మరో కంపెనీ రిటైల్ డీటైల్జ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కూడా రూ. 4 కోట్ల డీఫాల్ట్‌ను క్లెయిమ్ చేస్తూ దివాలా పిటిషన్‌ను దాఖలు చేసింది.

ఇవి కాకుండా ఇలాంటి చిన్న మొత్తాల బకాయిలను చెల్లించలేదని ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌పై దివాలా కేసులు దాఖలయ్యాయి. ఈ రుణ బకాయిలను చెల్లించడంలో కంపెనీ ఎప్పటికప్పుడు విఫలమవుతూనే ఉంది. ఈ క్రమంలోనే దివాలా పరిష్కార ప్రక్రియ ప్రారంభించేందుకు ట్రెబ్యునల్ ఆదేశించింది.

Next Story

Most Viewed