వేల కోట్లు మోసం చేసిన నీరవ్ మోదీ బ్యాంకు ఖాతాలో రూ. 236 బ్యాలెన్స్!

by Dishafeatures2 |
వేల కోట్లు మోసం చేసిన నీరవ్ మోదీ బ్యాంకు ఖాతాలో రూ. 236 బ్యాలెన్స్!
X

న్యూఢిల్లీ: ఒకప్పుడు కోట్లలో వ్యాపారం చేసిన, ఆర్థిక నేరస్థుడైన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ ప్రస్తుత అత్యంత దుర్భర దశను చూస్తున్నారని తెలుస్తోంది. 2019లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)కి వేల కోట్ల భారీ ఆర్థిక అవకతవకలకు పాల్పడిన నీరవ్ మోదీ పతనం ప్రారంభమైందా అంటే పరిశ్రమ వర్గాలు అవునంటున్నాయి. బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసిన మోదీ, చేసిన తప్పులకు మూల్యం చెల్లించడంలో భాగంగా నేడు బ్యాంకు ఖాతాలో కేవలం రూ. 236ను కలిగి ఉన్నారని ఓ నివేదిక తెలిపింది. ఎస్‌బీఐకి కోటక్ మహీంద్రా బ్యాంకు పన్ను బకాయిల కింద రూ. 2.46 కోట్లు చెల్లించగా మోదీకి చెందిన ఫైర్‌స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్(ఎఫ్‌డీఐపీఎల్) కంపెనీ ఖాతాలో కేవలం రూ. 236 బ్యాలెన్స్ మిగిలిందని, మరో రెండు బ్యాంకులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రాలలో కేవలం ఒక బ్యాంకుకు మాత్రమే బకాయి చెల్లింపు జరిగిందని నివేదిక వివరించింది.

కంపెనీకి నియమించిన లిక్విడేటర్ నగదును విడుదల చేయాలని కోరుతూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారని సమాచారం. 2021లో, ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ ప్రకారం ఎఫ్‌డీఐపీఎల్‌కు సంబంధించి నియమించబడిన లిక్విడేటర్ ద్వారా ఆ మొత్తాన్ని పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కి విడుదల చేయాలని కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇక, నీరవ్ మోదీని భారత్‌కు అప్పగించే విచారణలో భాగంగా చట్టపరమైన ఖర్చులు చెల్లించాలని లండన్‌లోని హైకోర్టు మోదీని ఆదేశైంచింది. తన వద్ద నగదు లేదని నీరవ్ చెప్పారని, దీనిపై చెల్లింపులు ఎలా చేస్తారనే కోర్టు ప్రశ్నకు రుణమిచ్చే వారికోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారని నివేదిక పేర్కొంది.


Next Story